Sandhya Devanathan | సరదా కబుర్లకు వాట్సాప్. కులాసా మూమెంట్లకు ఇన్స్టాగ్రామ్. పదునైన భావ వ్యక్తీకరణకు ఫేస్బుక్. ఈ మూడింటికీ మాతృసంస్థ మెటా. ఆ సంస్థ నిర్వహణకు ఓ మెరికలాంటి మేధస్సు కావాలి. ఆవిడే 46 ఏండ్ల సంధ్యా దేవనాథన్. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్గా సంధ్య నియమితులయ్యారు. అల్లాటప్పాగా వచ్చిన పదవి కాదిది. ఆడుతూపాడుతూ ఈ స్థాయికి చేరుకోలేదామె. ఇటీవల మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి అజిత్ మోహన్ తప్పుకొన్నారు. ఆయన స్థానంలో సంధ్యా దేవనాథన్ను నియమించారు. సంస్థలో చేరిన ఆరేండ్లలోనే ఇంతటి బాధ్యతను అప్పగించారంటే ఆమె ఎంతటి సమర్థురాలో అర్థం చేసుకోవచ్చు.
సంధ్య విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ (1994-98) చేశారు. తర్వాత ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ఎంబీయే చదివారు. 2000 సంవత్సరంలో ఉద్యోగ పర్వంలోకి అడుగుపెట్టారు. మేనేజ్మెంట్ పాఠాలను ఆపోశన పట్టిన సంధ్య బ్యాంకింగ్ రంగంలో తిరుగులేని సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. 2000 నుంచి 2009 వరకు సిటీ బ్యాంక్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. తర్వాత 2015 వరకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో పనిచేశారు. బ్యాంకింగ్, పేమెంట్, టెక్నాలజీ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లీడర్షిప్ కోర్సు చేశారు. 2016లో మెటాలో కాలు మోపారు.
మెటాలో అడుగుపెట్టడంతోనే మహా ఘటికురాలు అనిపించుకున్నారు సంధ్య. సింగపూర్, వియత్నాం దేశాల్లో మెటా విస్తరణలో కీలకంగా వ్యవహరించారు. ఆగ్నేయాసియాలో మెటా ఈ-కామర్స్ బాధ్యతలు పర్యవేక్షించారు. 2020లో ఇండోనేసియా వెళ్లి ఆసియా పసిఫిక్ కోసం గేమింగ్ లీడ్గా పనిచేశారు. అలా అంచెలంచెలుగా ఎదిగి మెటా సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. 2023 జనవరి 1న ఈ పదవిని అలంకరించనున్నారు. భారత్లో మెటా సేవలు మరింత విస్తరించడానికి సంధ్య అనుభవం దోహదం చేస్తుందని సంస్థ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ఉద్యోగంలో మాత్రమే కాదు సామాజిక సేవలోనూ ఆమె చురుగ్గా ఉంటారు. సింగపూర్ జాతీయ గ్రంథాలయం బోర్డులో సభ్యురాలిగా వ్యవహరించారు. సింగపూర్ మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయంలో సలహాదారుగా, ఉమెన్స్ ఫోరమ్ ఫర్ ది ఎకనామిక్స్లో సభ్యురాలిగా సేవలు అందించారు.
“Meta | టీనేజర్స్ భద్రత కోసం మెటాలో డీఫాల్ట్ సెట్టింగ్స్”