న్యూయార్క్ : టెకీలను లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనలతో పాటు ఆర్ధిక మందగమనం నేపధ్యంలో ట్విట్టర్ సహా పలు టెక్నాలజీ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాంలను నడిపే మెటా సైతం పలువురు ఉద్యోగులపై వేటు వేయనుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
కంపెనీ ఈమెయిల్ అంటేనే టెకీలు కలవరపడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం నవంబర్ 9 ఉదయం ఆరు గంటలకు కొందరు మెటా ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. జుకర్బర్గ్ ప్రకటనతో పలువురు మెటా ఉద్యోగులు లింక్డిన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలపై తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
తామందరిలో లేఆఫ్స్ టెన్షన్ నెలకొందని మెటాలో ఫ్రంటెండ్ కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్న ఆసిమా అహుజా లింక్డిన్లో రాసుకొచ్చారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..ఎంతమందికి గుడ్బై చెబుతారన్నది అంతుపట్టడం లేదు..ఇప్పుడు రెండు గంటలవుతోంది…తామంతా ఇంకా ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటున్నామని కామెంట్ చేశారు. మరోవైపు అమెరికా కేంద్రంగా మెటాలో ప్రోడక్ట్ మేనేజర్గా పనిఏసే విద్యా శ్రీనివాసన్ తన లింక్డిన్ పోస్ట్లో మెటా ఉద్యోగులెవరూ సంతోషంగా లేరని రాసుకొచ్చారు. ఇక మెటాలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.