Meenakshi | అందరిలా ఆమెకు బాల్య జ్ఞాపకాలు లేవు. అమ్మానాన్నలతో సరదాగా ఆడుకున్న ఆనవాళ్లు లేవు. పుట్టినప్పటి నుంచీ నాలుగు గోడల మధ్యే బతికింది. తలెత్తి ఆకాశం వైపు కూడా చూడలేదు. కిటికీ తెరిచి బయటి ప్రపంచాన్ని వీక్షించలేదు. ఆమెకు తెలిసిందల్లా.. ఒక నర్సు.. చేతిలో ఇంజెక్షన్.. పక్కన అమ్మమ్మ. పదహారేండ్లు వచ్చే వరకూ ఇదే జీవితం. దానికి తోడు.. ఆమె శరీరమే ఒక ప్రయోగశాలగా మారిపోయింది. 26 శస్త్రచికిత్సలతో ఛిద్రమైపోయింది. అయినా ఆమెలో ఆశావాదం చచ్చిపోలేదు. ఓ విదేశీ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్గా జీవితాన్ని ప్రారంభించి.. వందమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది మీనాక్షి. ఆ మలుపులన్నీ ఆమె మాటల్లోనే…
నా పేరు మీనాక్షి. పుట్టింది రాజమండ్రిలో. నాన్న టీచర్, తాత హోమియో డాక్టర్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా. పుట్టినప్పటి నుంచీ నాకు మల్టిపుల్ స్క్లిరోసిస్. ఆ వ్యాధి సమాజం కంటే దుర్మార్గమైంది. మన కండరాలను కదలనివ్వదు, ఎదగనివ్వదు. తిరుపతిలోని బర్డ్ దవాఖానలో డాక్టర్ జగదీశ్గారు నా కేసును సవాలుగా తీసుకున్నారు. మూడునెలల వయసు నుంచి 16 ఏండ్లు వచ్చేవరకూ చికిత్స కోసం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ పదహారేండ్లలో నడుము కింది భాగంలో 26 సర్జరీలు అయ్యాయి. ఇప్పుడు వీల్ చెయిర్లో అయినా కూర్చుంటున్నానంటే.. ఆ ఫలితమే. ప్రస్తుతం నా వయసు 35 ఏండ్లు. సగం జీవితం హాస్పిటల్ గోడల మధ్యే గడిచిపోయింది. అమ్మ, నాన్న, తమ్ముడు.. అందరికీ దూరంగా బతికాను. హాస్పిటల్లో నాతోపాటు అమ్మమ్మ ఉండేది. దీంతో ఆమెతోనే బలమైన అనుబంధం ఏర్పడింది. స్కూలు, కాలేజీ జీవితం లేదు కాబట్టి, స్నేహితులు లేరు. బంధువుల్లో కూడా ఎవరికీ నేను ఉన్నాననే విషయమే తెలియదు. సర్జరీలు చేసినా నా శరీరం స్వీకరించదని నిర్ధారించుకున్నాక వైద్యులు నన్ను ఇంటికి పంపారు. విశాలమైన ప్రపంచంలోకి వచ్చాను. మనుషుల్ని, మనస్తత్వాల్ని అర్థం చేసుకున్నాను. నాకు బాగా చదువుకోవాలని కోరిక. డాక్టర్ కావాలని ఆశ. నాన్నకు మాత్రం నేను పుస్తకం పట్టుకుంటేనే మంట. తిట్టేవారు, కొట్టేవారు. అమ్మ ప్రోత్సాహంతో ఇంట్లోనే తమ్ముడి పుస్తకాలు చదివి పదో తరగతి పాసయ్యాను.
ఇంటర్లో చేరతానంటే ససేమిరా అన్నారు నాన్న. అప్పుడే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఇంటికొచ్చారు. వాళ్లబ్బాయీ నాలానే దివ్యాంగుడు. తన దగ్గరే మొదటిసారి కంప్యూటర్ చూశాను. కంప్యూటర్ అనేది ఒకటి ఉందనీ.. అందులో ఇంటర్నెట్ వస్తుందనీ అప్పుడే తెలిసింది. అలా డిజిటల్ వరల్డ్ పరిచయమైంది. గ్రాఫిక్ డిజైనింగ్ అనే కెరీర్ గురించి తన ద్వారానే తెలిసింది. అటువైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ముందుగా డీటీపీ నేర్చుకున్నాను. ఆ తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్కి మారాను. యాహూ చాట్ రూమ్స్లో కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ పరిచయం అయ్యారు. వాళ్ల సహకారంతో గ్రాఫిక్ డిజైనింగ్ మీద పట్టు సాధించాను. నా నైపుణ్యాన్ని గుర్తించిన స్నేహితుడు అశోక్.. అందర్నీ ఒప్పించి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. లండన్లోని ఒక ఏజెన్సీకి జూనియర్ గ్రాఫిక్ డిజైనర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అదీ వర్క్ ఫ్రమ్ హోమ్. స్కిల్స్ పెంచుకుని విజువల్ డిజైనర్గా మారాను. జాబ్ చేస్తూనే.. డిజైనింగ్లో శిక్షణ కూడా ఇస్తున్నాను. ముఖ్యంగా దివ్యాంగులకు, గృహిణులకు, చదువు మధ్యలో ఆపేసి.. చిన్నవయసులో పెళ్లిళ్లు చేసుకున్నవారికి.. ఇలా దాదాపు వందమందికి ఉద్యోగావకాశాలు కల్పించాను.
ఆంగ్లం మీద పట్టు సాధించాలని నా కోరిక. ఇంట్లో ఉన్నప్పుడే రోజూ ఇంగ్లిష్ పేపర్లు చదివేదాన్ని. తెలియని పదాలకు డిక్షనరీలో అర్థం వెతుక్కునేదాన్ని. ఇంటర్నెట్ అలవాటైన తర్వాత రోజూ ఆన్లైన్లో విదేశీయులతో మాట్లాడేదాన్ని. అలా చాటింగ్ ద్వారా భాష మీద పట్టు సాధించాను. ఇంగ్లిష్ సినిమాలు, పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు హిందీ, కొరియన్ కూడా మాట్లాడగలను. దూరవిద్యలో బీకాం చేశాను. ఇలా ఎందుకు పుట్టాను. ఇలా ఎందుకు మిగిలాను? తదితర ప్రశ్నలతో నేనెప్పుడూ కాలాన్ని వృథా చేసుకోలేదు. నా జీవితాన్ని రీడిజైన్ చేసుకోవడం మీదే దృష్టి సారించాను. మొదటినుంచీ నాన్నకు నేనంటే ద్వేషం. వైకల్యంతో పుట్టాననే కారణం కావచ్చు. నన్ను వదిలించు కోవాలని రెండుసార్లు ప్రయత్నించారు. ఒకసారి విషమిచ్చి.. ఇంకోసారి కిరాయి మనుషులతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. నాకు మద్దతు ఇస్తుందన్న కారణంతో అమ్మను కూడా ఇబ్బంది పెట్టేవాడు. అందుకే అమ్మను, అమ్మమ్మను తీసుకొని ఇంట్లోంచి బయటికి వచ్చేశాను. హైదరాబాద్లో స్థిరపడ్డాను. దివ్యాంగ మహిళల కోసం ఓ సంస్థను స్థాపించే ఆలోచన ఉంది.
ప్రతి ఒక్కరికీ తమ కాళ్లపై తాము నిలబడే హక్కు ఉంది. అవకాశాలూ ఉన్నాయి. దివ్యాంగులకే ఆ అదృష్టం లేదు. దివ్యాంగులు చిన్నచిన్న కిరాణా షాపులు, ట్యూషన్లు, కుట్టు మిషిన్ల దగ్గరే ఆగిపోతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతమంది స్థిరపడుతున్నారు? అక్కడివరకూ మమ్మల్ని రానివ్వడం లేదు. ముఖ్యంగా, గైడెన్స్ ఇచ్చేవారే కరువైపోయారు. వైఫల్యాల నుంచి నేను నేర్చుకున్న పాఠాలను దివ్యాంగులకు అందిస్తాను. మహిళలకు మాత్రమే శిక్షణ ఇవ్వాలన్న నా నిర్ణయానికి కారణం ఇదే.
✍ నవీన్ కుమార్ రెడ్డి, 📷 నరేందర్ నంగునూరి
“అప్పుడు చెత్తతో ఏం పని అన్నరు.. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తోంది”