Kanika Tekriwal | కలలు కనే మనసుండాలి. వాటిని సాకారం చేసుకునే సత్తా ఉండాలి. ఈ జోడీ కుదిరితేనే అనుకున్నది సాధిస్తాం. అందుకు నిలువెత్తు ఉదాహరణ భోపాల్కు చెందిన కనిక తెక్రీవాల్. ముప్పై మూడేండ్ల వయసుకే పది చార్టర్డ్ ఫ్లయిట్స్కు యజమాని అయ్యారు. పదేండ్ల క్రితం ఆమె స్థాపించిన ‘జెట్సెట్గో ( JetSetGo )’ అనే విమానయాన సంస్థ నికర విలువ రూ. 420 కోట్లు. కొటక్ వెల్త్ ( Kotak Wealth )- హురున్ ఇండియా ( Hurun India ) సంయుక్తంగా విడుదల చేసిన ‘దేశంలోనే అత్యంత సంపద కలిగిన 100 మంది మహిళల జాబితా’లో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది తెక్రీవాల్. ఆ విజయ ప్రస్థానం…
ఆటోమొబైల్ రంగమంటేనే పురుషాధిక్య ప్రపంచం. అలాంటిది నిండా పాతికేళ్లు కూడా లేని ఓ యువతి తనే సొంతంగా ఓ సంస్థను స్థాపించింది, అది కూడా విమానయానానికి సంబంధించి. పదేళ్ల క్రితం ఆమె చేసిన ప్రయత్నం ఏవియేషన్ రంగంలో ఒక కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. మనకు ఆటోనో, కారో అవసర మైనప్పుడు ఉబెర్, ఓలా ఎలా బుక్ చేసుకుంటామో… అచ్చం అలాగే చార్టర్డ్ ఫ్లయిట్లనూ నడపగలిగితే బాగుంటుందన్నది ఆమె ఆలోచన. సులభంగా బుక్ చేసు కోవడానికి వీలుగా.. వెబ్సైట్, యాప్ రూపొందించారు. ‘జెట్సెట్గో’ అనే సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి ఎక్కడినుంచి ఎక్కడికెళ్లాలి? ఎంతమంది వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? తదితర వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. ఆ సమయంలో ఏయే చార్టర్డ్ ఫ్లయిట్లు అందుబాటులో ఉన్నాయో, చార్జీలు ఎంతో తెలిసిపోతుంది. బుక్ చేసుకోవడమే ఆలస్యం. జెట్సెట్గో విమానయాన రంగంలోకి అడుగుపెట్టక ముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ప్రత్యేకంగా ఫ్లయిట్ బుక్ చేసుకోవాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది.
ముంబయిలో విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసేప్పుడూ, ఆ తర్వాత యూకేలో ఎంబీఏ చదివేప్పుడూ కొన్ని విమానయాన సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పనిచేశారు కనిక. ఆ సమయంలోనే సాంకేతిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అదే సమయంలో ఆమె క్యాన్సర్ బారినపడ్డారు. దానినుంచి కోలుకోవడానికి ఏడాదికి పైగా పట్టింది. అలా 2012లో 5600 రూపాయల పెట్టుబడి పెట్టి ఉబెర్, ఓలా తరహాలో చార్టర్డ్ ఫ్లయిట్లను బుక్ చేసుకునేందుకు ఒక యాప్ను డెవలప్ చేయించుకున్నారు. సొంత నిధులతో రెండేళ్లు సంస్థను నడిపించారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న చార్టర్డ్ అకౌంటెంట్ సుధీర్ పెర్లా ఈ సంస్థలో భాగస్వామిగా మారారు. ప్రస్తుతం సంస్థ దగ్గర పది ఫ్లయిట్లు ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఆఫీసులున్నాయి. ‘దేశంలోని వివిధ నగరాల మధ్య తిరిగేందుకు మా ఫ్లయిట్లను వినియోగిస్తున్నాం. అక్కడితో ఆగకుండా.. నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా సర్వీసుల్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ముంబయిలో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించాం.’ అని చెబుతారు కనిక.
తాతయ్య స్ఫూర్తితోనే ఈ స్థాయికి వచ్చా.. నా సక్సెస్కి ఆయనే కారణమంటున్న దీపికా రెడ్డి”