BK Ponwar : భారత్, పాకిస్థాన్ (India, Pakistan) నడుమ జరిగిన 1971 నాటి యుద్ధంలో విశేష సేవలు అందించిన అనుభవజ్ఞుడు, మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేశంలో ఆధునిక అటవీ యుద్ధ తంత్రానికి రూపకర్త అయిన రిటైర్డ్ బ్రిగేడియర్ (Retired Brigadiar) బసంత్కుమార్ పొన్వార్ (Basant Kumar Ponwar) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏళ్లు. బుధవారం కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు.
బసంత్ కుమార్ కుమారులు ఇద్దరూ సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు. పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో యువ అధికారిగా బసంత్కుమార్ ఆకస్మిక దాడులకు నాయకత్వం వహించి, ఢాకా వైపు మన సేనలు వేసిన ముందడుగులో కీలకపాత్ర పోషించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పుట్టిన ఆయన 1969 లో సైన్యంలో చేరారు. 36 ఏళ్ల మిలిటరీ కెరియర్లో పలు మైలురాళ్లను అధిగమించి, అవార్డులు అందుకున్నారు.
2005 లో సైన్యం నుంచి రిటైర్ అయ్యాక ఛత్తీస్గఢ్ పోలీసు విభాగంలో ఐజీగా నియమితులై ఉత్తర బస్తర్లోని కాంకేర్లో ‘కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ఫేర్ కాలేజ్’ ను స్థాపించారు. ఈ కళాశాలలో 18 ఏళ్లు పనిచేసి, నక్సల్స్ను ఎదుర్కొనేందుకు 37 వేల మందికిపైగా పోలీసులకు శిక్షణ ఇచ్చారు.