Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురంలో తెల్లవారుజామున దారుణం జరిగింది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారి భుజంగరావు (60)పై కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
గుర్రంగూడకు చెందిన భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా.. ఆయన ఇంటి పక్కనే ఉండే శివేందర్ సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం యాక్టివాపై భుజంగరావు పాలు తీసుకెళ్తుండగా శివేందర్ సింగ్ కత్తితో దాడి చేశాడు. అనంతరం శివేందర్ సింగ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన భుజంగరావును ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించాడు. కాగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.