Pavani Lolla | ‘ఇంజినీరింగ్ చేశావు. ఎంబీఏ చదువుతున్నావు. మంచిగా కార్పొరేట్ ఉద్యోగం చేసుకోక.. ఆ చెత్తలో ఏముంది?’ అంటూ బంధువుల వెక్కిరింపులు ఒక వైపు. ‘ఈ వ్యర్థాలకు సరైన అర్థం చూపకపోతే నా చదువు, తెలివి.. అన్నీ వృథా’ అన్న ఆత్మవిశ్వాసం మరో వైపు. చివరికి మనసు మాటే విన్నది. తన జీవితానికి పరమార్థాన్ని కనుగొన్నది ఆంత్రప్రెన్యూర్ పావని లొల్ల.
పావనికి చిన్నప్పటి నుంచీ ప్రకృతి అన్నా, పర్యావరణం అన్నా ఎంతో ఇష్టం. క్రాకర్స్ వల్ల కాలుష్యం పెరుగుతుందని ఎవరో చెబితే.. బడి వయసులోనే దీపావళి పటాసులు కాల్చడం మానేసింది. ఇంజినీరింగ్ చదువుతున్నా ధ్యాసంతా ప్రకృతి వైపే. ‘ఎకో క్లబ్’ పేరుతో ఓ స్టూడెంట్ ఫోరమ్ ఏర్పాటుచేసింది. తరగతి గదుల్లో డస్ట్బిన్స్ పెట్టేలా మేనేజ్మెంట్ను అప్రమత్తం చేసింది. ఆరుబయట చెత్త వేయకుండా విద్యార్థులకు బాధ్యత నేర్పింది. కాలేజ్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాల నిర్వహణ గురించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసింది. స్వయంగా చెత్తబుట్టలు పంచింది. అయితే, కొన్నాళ్లకు గ్రామీణులు వాటిలో నీళ్లు నిల్వ చేసుకోవడం చూసి బాధపడింది. ఆ చెత్త డబ్బాలకే సెన్సర్లు బిగించి ఇంకో ప్రయోగం చేసింది. అదీ ఫలించలేదు. అప్పుడే, చెత్త సేకరించడం కన్నా.. ఆ చెత్తను ఎరువుగా మారిస్తే.. వాళ్లే తిరిగి ఉపయోగించుకుంటారనే ఆలోచన వచ్చింది. తన మనసులో మాట తల్లికి చెప్పింది. అప్పటివరకు కుట్టుపనితో సంపాదించిన రూ.30 వేలూ కూతురి చేతిలో పెట్టి ప్రోత్సహించిందా మాతృమూర్తి.
ఓసారి, ఐఎస్బీలో జరిగిన ఆంత్ర ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్లో పాల్గొన్నది పావని. అక్కడే తెలంగాణ ‘టాస్క్’ గురించి తెలుసుకుంది. అక్కడికెళ్లి చెత్తను ఎరువుగా మార్చే పరికరాలపై అధ్యయనం చేసింది. నాలుగైదు మోడళ్లను తీసుకుని ప్రయోగాలు చేసింది. ఆ అనుభవంతో ఓ యూనిట్కు రూపం ఇచ్చింది. అమ్మ దగ్గర్నుంచి తీసుకున్న డబ్బుతో మరికొన్ని యూనిట్లు తయారు చేయించి.. చుట్టుపక్కల గ్రామాల్లో తోటపని వారికి ఉచితంగా పంచింది. కొంతకాలం తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని.. తన ఉత్పత్తికి మరిన్ని మెరుగులు దిద్దింది. ఆ కంపోస్ట్ యంత్రాలు మెరుగ్గా పనిచేస్తుండటంతో ‘ఉచితంగా ఇస్తే.. నువ్వే నష్టపోతావు’ అని కొందరు రైతులు సలహా ఇవ్వడంతో.. ఓ ధర నిర్ణయించింది. ఇంజినీరింగ్ తర్వాత ఎంబీఏ చేస్తూనే ఇవన్నీ దగ్గరుండి చూసుకునేది. ఆ ప్రయత్నంలో స్నేహితుడు సిద్ధేశ్ అండగా నిలిచేవాడు. ఈ క్రమంలో ‘ఫ్యూచర్స్ స్టెప్ ఎంటర్ ప్రైజెస్’ పేరుతో ఓ కంపెనీని రిజిస్టర్ చేయించింది. దానిద్వారా ‘వప్రా కంపోస్టింగ్’ పేరుతో చెత్తను ఎరువుగా మార్చే యంత్రాలు, ఆర్గానిక్ మైక్రోబియల్ లిక్విడ్స్, గ్రీన్ మిక్స్ పౌడర్లు విక్రయిస్తున్నది. ప్రజల్లో అవగాహన పెరిగి వ్యాపారం ఊపందుకుంటున్న సమయంలో కొవిడ్ వచ్చింది. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. చెత్త సేకరించేందుకు వర్కర్లు భయపడ్డారు. వీటికి తోడు బంధువుల హేళనలు. ప్రతి సమస్యనూ ఓ సవాలుగా తీసుకొన్నది పావని. తనదైన శైలిలో సంక్షోభాలను దాటుకుంటూ.. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. ముందుకు సాగింది. మరింత ప్రొఫెషనలిజం కోసం ‘వీహబ్’ను సంప్రదించింది. ఆమె ఆలోచనలు నచ్చి పావనిని ఇన్క్యుబేషన్ కార్యక్రమానికి ఎంపిక చేసింది వీహబ్. ఓ మెంటర్ను కూడా కేటాయించడంతో.. ఆ నిపుణుడి సహకారంతో మార్కెటింగ్, టార్గెట్ కస్టమర్లు, సోషల్ మీడియా తదితర అంశాల మీద పట్టు సాధించింది. వీ హబ్ అండతో వ్యాపారాన్ని 14 రాష్ట్రాలకు విస్తరించింది. త్వరలోనే నేపాల్లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది పావని.
పావని లొల్ల తన కంపెనీ (vapracomposting.in) ద్వారా ప్రవేశపెట్టిన ఉత్పత్తులన్నీ పర్యావరణహితమైనవే. పంట చేతికొచ్చాక పొలంలోని కొయ్యకాళ్లను కాల్చేయకుండా.. నేరుగా ఎరువుగా మార్చేందుకు ‘వప్రా బ్రౌన్ లిక్విడ్’ను ప్రవేశపెట్టింది. వంటింటి చెత్తను వారంరోజుల్లో ఎరువుగా మార్చే ‘వప్రా హోం కంపోస్టింగ్ కిట్’ను అందుబాటులోకి తెచ్చింది. గేటెడ్ కమ్యూనిటీస్ కోసం ‘సొసైటీ కంపోస్ట్’ మిషన్ను ప్రవేశపెట్టింది. డస్ట్బిన్లోని చెత్తను అందులోనే ఎరువుగా మార్చే ‘గ్రీన్ మిక్స్ పౌడర్’ను, ఆర్గానిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ‘ప్లాంట్ఫిట్ కంపోస్ట్’ ఎరువును విక్రయిస్తున్నది. ‘ప్రభుత్వానికి నా అభ్యర్థన ఒక్కటే.. మీరు అందించే డస్ట్బిన్స్తో పాటు మా గ్రీన్ మిక్స్ పౌడర్ కూడా పంపిణీ చేయండి. ఇక పౌరులే చెత్తను ఎరువుగా మార్చుకుంటారు. ఈ ఎరువును మొక్కలకు వేస్తే.. ఏపుగా పెరుగుతాయి. పచ్చదనం పెరుగుతుంది. పరోక్షంగా చెత్త సమస్య కూడా తగ్గుతుంది’ అంటున్నది పావని.
…✍ రవికుమార్ తోటపల్లి, 📷రజనీకాంత్ వీరగోని
అందరూ హేళన చేసినా.. వీ హబ్ అండగా నిలబడింది.. నా కలను నిజం చేసింది’”