AP CM : తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను ఇక్కడి ప్రజలు, నాయకులు తిప్పికొడితే తిరిగి తప్పును మనపైకే నెట్టడం ఆంధ్రా అతితెలివి నాయకులకు అలవాటుగా మారింది. తాజాగా పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే అహంకారంతో ఇక్కడి సమాజానికి ఒళ్లు భగ్గున మండే మాట మాట్లాడారు. తెలంగాణలో కూడా జనసేన పోటీచేస్తుంని చెబుతూనే.. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ తోలు మందం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు, నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే’ అని పవన్కల్యాణ్ గూబగుయ్యిమనేదాకా తెగేసి చెప్పారు.
ఈ వివాదంపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు చిలుకపలుకులు పలికారు. పవన్కల్యాణ్పై వ్యాఖ్యలు సరికాదు, అలాంటి వ్యాఖ్యలతో సమస్యలు సృష్టించవద్దని మతిలేని హితవు పలికారు. కానీ.. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ పవన్కల్యాణ్ చేసిన కండకావరం వ్యాఖ్యలు మాత్రం ఈ రెండు కళ్ల సిద్ధాంతికి తప్పుడు వ్యాఖ్యలు అనిపించలేదు. అంతేకాదు ‘తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన యూనిట్ను ఏర్పాటు చేసుకుందని, అప్పుడు ఏపీలో ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదని చంద్రబాబు తన నక్కజిత్తులను మరోమారు ప్రదర్శించారు.
ఎందుకంటే.. తెలంగాణ ప్రజలుగానీ, నాయకులుగానీ ‘జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది’ అనే ప్రకటనపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అన్న వ్యాఖ్యలపైనే మండిపడ్డారు. ఈ విషయం నక్కబుద్ధి చంద్రబాబుకు అర్థంకాక కాదు. ఉద్దేశపూర్వకంగానే తన నక్క జిత్తులకు పదునుపెట్టారు. ‘జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది’ అన్నందుకే ఇక్కడి సమాజం పవన్ కల్యాణ్ను విమర్శిస్తుందన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 12 ఏళ్లు దాటిపోయిందని, ఈ సుదీర్ఘ కాలంలో ఎవరెవరు ఏం చేశారనేది రెండు రాష్ట్రాల ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసని బాబులవారు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ పాలకుల కంటే ఆంధ్రా పాలకులమైన తామే తెగ పొడిచేశామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. పవన్కల్యాణ్ వివాదానికి, రెండు రాష్ట్రాల్లో అభివృద్ధిని పోల్చడానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ జిత్తులమారి చంద్రబాబు దేనితో దేనికైనా లింకుపెట్టగలరు. ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఏవైనా సమస్యలు లేదా భేదాభిప్రాయాలు ఉంటే రాజకీయంగా, లాజికల్గా ముందుకెళ్లాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని పక్షపాతమే తెలియని మహానుబావుడిలా సుద్ధులు చెప్పారు. కానీ ఈ వివాదాన్ని రాజేసిందే పవన్కల్యాణ్ అనే లాజిక్ను మాత్రం ఈజీగా కప్పిపుచ్చారు.
తాను ఇటీవలే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చానని, అక్కడికి కర్ణాటకతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నేతలు వచ్చారని, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించే ప్రయత్నం చేసిందని, జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందంటే ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారో తనకైతే అర్థం కావడం లేదని చంద్రబాబులవారు తనలోని నంగనాచి నటుడిని పట్టిపట్టి బయటికి ఈడ్చారు. కేసీఆర్.. ఆంధ్రాకు బీఆర్ఎస్ను విస్తరించారుగానీ, ఆంధ్రా నాయకులనుగానీ, ప్రజలనుగానీ ‘ఆంధ్రా మీ అయ్య జాగీరా..’ అని తలతిక్క వ్యాఖ్య చేయలేదనే విషయం బాబుకు తెలియదా..? తెలంగాణ సమాజం భగ్గుమన్నది జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందన్నందుకు కాదు, పవన్కల్యాణ్ నోరుపారేసుకున్నందుకు అని బాబుకు తెలిసినా తెలియనట్టే నటించడం ఆయన పక్షపాతబుద్ధికి నిదర్శనం కాదా..?