Rajinikanth | సూపర్స్టార్ రజనీకాంత్ భార్య, శ్రీ దయా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లతా రజనీకాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో నిర్వహించిన ‘మక్కల్ మేడై – సిటిజన్ ప్లాట్ఫామ్’ అధికారిక వెబ్సైట్, సభ్యత్వ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ప్రజల భాగస్వామ్యంతో స్థానిక సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ, సామాజిక సంక్షేమం కోసం ఈ వేదిక పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో రజనీకాంత్ చేసిన ఓ కీలక ప్రకటనపై ఆమె స్పష్టత ఇచ్చారు. తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరి జల వివాదం తీవ్రంగా ఉన్న సమయంలో దక్షిణాది నదుల అనుసంధానం అవసరాన్ని రజనీకాంత్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రారంభమైతే తన వంతుగా రూ.కోటి విరాళం అందిస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు.
ఈ హామీపై తాజాగా లతా రజనీకాంత్ మాట్లాడుతూ.. రజనీకాంత్ తన మాటను ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదని స్పష్టం చేశారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను ప్రారంభించిన వెంటనే, తాను ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని అందించేందుకు రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుల సంక్షేమానికి నదుల అనుసంధానం ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో రజనీకాంత్ ఎప్పుడూ తనవంతు సహకారం అందించేందుకు ముందుంటారని చెప్పారు. ఇదిలా ఉంటే, లతా రజనీకాంత్ పాల్గొన్న ‘మక్కల్ మేడై – సిటిజన్ ప్లాట్ఫామ్’ కార్యక్రమం ద్వారా ప్రజలను సామాజిక కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించడం, పర్యావరణాన్ని కాపాడటం, నీటి వనరులను పునరుద్ధరించడం వంటి అంశాలపై ఈ వేదిక ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.
రజనీకాంత్ రూ.కోటి విరాళం ఇస్తానన్న హామీపై లతా రజనీకాంత్ తాజాగా ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందా, రజనీకాంత్ ఎప్పుడు తన హామీని అమలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.