యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు వాగులో వరద నీరు పెరగడంతో బ్రిడ్జిపైకి నీరు చేరింది. దీంతో సంగెం-భువనగిరి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పరిస్థితిని గమనించిన అధికారులు బ్రిడ్జి వద్ద అప్రమత్త చర్యలు చేపట్టి, ఎవరూ వరద నీటిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, బ్రిడ్జిపైకి వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.