yeddula krishna reddy | నలభై ఏండ్లు దాటాయంటే కీళ్ల నొప్పులు. యాభై దాటాక గుండెదడ. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య పరిస్థితి ఇదే! కానీ ఏడుపదుల వయసులోనూ కరాటే విన్యాసాలతో అలరిస్తున్నారు ఎద్దుల కృష్ణారెడ్డి. నడకలోనూ ఆయన రికార్డులు సాధిస్తున్నారు. దశాబ్దాల పాటు వైద్యుడిగా సేవలందించిన కృష్ణారెడ్డి.. వయోధికులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యాన్ని జయిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా గన్యాగుల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఎంబీబీఎస్ చదివారు. చెన్నై అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంహెచ్ఎస్సీ చేశారు. 1978లో హైదరాబాద్లోని సైదాబాద్లో వివేక్ దవాఖాన ప్రారంభించారు. దాదాపు యాభై ఏండ్లుగా లక్షలాది రోగులకు సేవలు అందించారు. అయితే కృష్ణారెడ్డికి చిన్నప్పటి నుంచీ కరాటే నేర్చుకోవాలని కోరిక. కానీ, బాల్యంలో అది సాధ్యపడలేదు. తర్వాత, వైద్యుడిగా బిజీ కావడంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. 48 ఏండ్ల వయసులో పట్టుదలతో కరాటే నేర్చుకున్నారు. రెండేండ్లలో బ్లాక్బెల్ట్ సాధించారు. ఒకవైపు వైద్యుడిగా సేవలు అందిస్తూనే కరాటే సాధన కొనసాగించారు.‘ఇప్పుడు కరాటే ఏమిటి?’ అని చాలామంది నవ్వినా పట్టించుకోలేదు.
70 ఏండ్ల వయసులోనూ కరాటే విన్యాసాలతో రికార్డులు కొల్లగొడుతున్నారు కృష్ణారెడ్డి. 2021లో 75 టైల్స్ను మూడు నిమిషాల 20 సెకెన్లలో పగలగొట్టి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించారు. అదే ఏడాది మేకుల బల్లపై పడుకుని 159 షాబాద్ బండలను 7 నిమిషాల వ్యవధిలో ఛాతీపై పగులగొట్టించుకుని కొత్త రికార్డు నెలకొల్పారు. తర్వాత తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని అతితక్కువ సమయంలో నడిచి సరికొత్త రికార్డు సృష్టించి.. పట్టుదలకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు.
కృష్ణారెడ్డి సమాజ సేవలోనూ ముందున్నారు. వివేకానంద యువ కేంద్రం, భారతీయ వికాస్ యోజన సమితి, సేవా భారతి, ఆరోగ్య భారతి తదితర సంస్థలతో కలిసి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. నల్లమలలోని చెంచుపెంటలు, నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోని గిరిజన గూడాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు.