Norton bikes collection | ‘మీకు బైక్స్ అంటే ఎంతిష్టం?’ అని గుర్దేవ్ సింగ్ను అడిగితే.. తన గుండె లోతుల్లోని ‘నార్టన్’ బైక్స్ జ్ఞాపకాలను పుంఖానుపుంఖాలుగా చెబుతూపోతారు. ఆయన ఇంట్లో కొలువైన వింటేజ్ బైక్స్ గ్యాలరీని చూస్తే.. ‘వావ్! గుర్దేవ్ జీ..’ అనాల్సిందే. దాదాపు యాభై అరుదైన బండ్లు.. దేనికదే ప్రత్యేకం.
‘ఏమిటి సార్జీ.. మీ రెండో అబ్బాయికి అదేం పేరు? అలా ఎలా పెట్టారు?.. నలుగురూ ఏమనుకుంటారు?’
‘ఎవరైనా తాత పేరో, ముత్తాత పేరో, తండ్రి పేరో పెట్టుకుంటారు. మీరేమో..’
..ఇలా ఎందరు నిట్టూర్చినా, తను మాత్రం మనసు మార్చుకోలేదు. చిన్న కొడుక్కి తన ప్రాణానికి ప్రాణమైన ‘నార్టన్’ బైక్ పేరే పెట్టారు. ‘నార్టన్ సింగ్’ అని నోరారా నామకరణం చేశారు. అదీ.. గుర్దేవ్ సింగ్ అలియాస్ పప్పీ సింగ్కు నార్టన్ బైక్స్ మీదున్న ప్రేమ. ఆరుపదులు దాటినా సరే.. తన దగ్గరున్న 48 నార్టన్ క్లాసిక్ బైక్స్లో నచ్చిన మోడల్ను తీసుకొని రైడింగ్ వెళ్తారు. సికింద్రాబాద్ మొత్తం చక్కర్లు కొడతారు. ఆ వింటేజ్ బైక్స్ నుంచి వచ్చే శబ్దాలు తన గుండె లబ్డబ్లూ.. రెండూ ఒకటేనంటారు గుర్దేవ్ సింగ్.
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో 1898లో నార్టన్ బైక్స్ తయారీ మొదలైంది. తొలిరోజుల్లో విశేష ఆదరణ ఉండేది. అప్పటికే రేసింగ్ బైక్స్గా అవి పేరొందాయి. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల కోసం లక్ష బైకుల ఉత్పత్తికి సిద్ధమైంది కంపెనీ. యుద్ధ సమయంలో విరివిగా వాడిన ద్విచక్ర వాహనాల్లో ‘నార్టన్’ బైక్స్ కూడా ఉన్నాయి. యుద్ధం తర్వాత 1946 నుంచి మళ్లీ కొత్త బైకుల తయారీకి సిద్ధపడింది. అయితే, ప్రపంచ యుద్ధంలో పాడైన బైకులు తుక్కు కింద భారత్కు వచ్చేవి. ఆ విషయం తెలుసుకున్న పదేండ్ల గురుదేవ్సింగ్.. ఎలాగైనా ఓ బైకును సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రులిచ్చే పాకెట్ మనీ పావలా (25 పైసలు)ను జాగ్రత్తగా దాచుకునేవారు. పన్నెండో ఏడు వచ్చేసరికి రూ.150 సమకూర్చుకుని తన డ్రీమ్ బైక్ ‘నార్టన్ 16హెచ్’ను స్క్రాప్ యార్డ్ నుంచి కొనుగోలు చేశాడు. దానికోసమే మెకానిజం నేర్చుకొని, అందంగా పెయింట్ వేసి తిరిగి ప్రాణం పోశాడు. ‘నేను కిక్ కొట్టి.. బైక్ స్టార్ట్ చేస్తే.. ఆ శబ్దానికి కిటికీలు తెరిచి చూసేవారు’ అంటూ ఆ రోజులను గుర్తుచేసుకుంటారు.
గుర్దేవ్ సింగ్ దగ్గర రేసింగ్లో ఓ వెలుగు వెలిగిన నార్టన్ మ్యాంక్స్ వంటి బైకులతో పాటు.. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వింటేజ్ కార్ల కలెక్షన్ కూడా ఉంది. దివంగత పీవీ నరసింహారావు ఉపయోగించిన హిందుస్థాన్ మోటార్స్ బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్, ఇద్దరు రాష్ట్రపతులు వాడిన సౌరశక్తితో నడిచే కాడిలాక్ వంటి వాహనాలూ ఉన్నాయి. వింటేజ్ కార్ల సంఖ్యే దాదాపు 52. వీటితోపాటు పాతకాలపు జలాంతర్గామి ట్రక్, మిగ్ 21 ఫైటర్ జెట్ కూడా ఉన్నాయి. వాడేందుకు వీలుగా లేకపోయినా, నిక్షేపంగా సెల్ఫీలు తీసుకోవచ్చు. మొత్తంగా తన దగ్గర 365 బైక్లు ఉన్నాయి. వీటిలో 80 శాతం వింటేజ్ హోదా కలిగినవే. ఏటా గణతంత్ర దినోత్సవం నాడు వీటితో ర్యాలీ తీస్తారు గుర్దేవ్ సింగ్.
గుర్దేవ్ సింగ్ కుటుంబం సికింద్రాబాద్లో స్థిరపడింది. ఎంజీ రోడ్లోని ‘విశ్వకర్మ మెకానిక్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్’ పేరుతో భవన నిర్మాణ సామగ్రి వ్యాపారం చేస్తున్నది. చుట్టు
పక్కల వారంతా గురుదేవ్ను ‘పప్పీ సేఠ్’ అని ముద్దుగా పిలుస్తారు. ఆయన పెద్ద కొడుకు సందీప్ సింగ్ సోఖీ.. ప్రొఫెషనల్ మోటార్బైక్ డ్రాగ్ రేసర్. డ్రాగ్ రేసింగ్లో అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ఈ రేస్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. మోటార్సైకిల్ డ్రాగ్ రేసింగ్లో ప్రపంచ ఫైనల్స్కు చేరుకున్న ఇద్దరు హైదరాబాదీల్లో తనూ ఒకడు. చిన్నకొడుకు నార్టన్ సింగ్. ఇతను కూడా బైక్, కార్ రేసర్. హోండా, కవాసకి, సుజుకి, యమహా వంటి రేస్బైక్లతో ఓ ఆట ఆడుకుంటారు అన్నదమ్ములు. ఇంటికింద తండ్రి బైక్స్ గ్యాలరీ.. ఇంట్లో అన్ని గదుల్లో కొడుకులు సంపాదించిన రేసింగ్ ట్రోఫీలు చూడముచ్చటగా ఉంటాయి. రేసింగ్ అనేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందని సగర్వంగా చెబుతారు గుర్దేవ్ సింగ్ బిడ్డలు.
…? రవికుమార్ తోటపల్లి