Bullettu bandi | మార్కెట్లోకి ఎన్ని బైకులు వచ్చినా సరే రాజసం అంటే బుల్లెట్ బండిదే ! యువతలో చాలామంది కలల బండి అదే !! కేవలం అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఈ బండి అంటే విపరీతమైన పిచ్చి !! అందుకే నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గని అంటూ పెళ్లీడుకు వచ్చిన ఓ అమ్మాయి తనకు కాబోయే వాడి గురించి కలలు కంటుంది.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్.. అంటూ ఇంకో అమ్మాయి తన ప్రియుడిని వర్ణిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ( royal enfield ) బైక్పై ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు పాటలు బాగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా మంచిర్యాలలో జరిగిన ఓ పెళ్లి బారాత్లో నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా నవవధువు చేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదీ బుల్లెట్ బండికి ఉన్న క్రేజ్ !! వందేళ్ల చరిత్ర కలిగిన ఈ బండి ఎక్కడ పుట్టింది? మన ఇండియాకు ఎలా వచ్చింది? దాని వెనుకున్న చరిత్రేంటి? ఒకప్పుడు రాజులా వెలిగిపోయిన బుల్లెట్ బండి ( Bullettu bandi ) ఆ మధ్యకాలంలో ఎందుకు కనుమరుగైంది? మళ్లీ ఎలా తన పునర్వైభవాన్ని సంపాదించుకుంది.. వంటి విషయాలు ఒకసారి చూద్దాం..
ఇంగ్లండ్లోని రెడిచ్ పట్టణంలో హంట్ ఎండ్ అనే చిన్న గ్రామంలో జార్జ్ టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీ ఉండేది. కుట్టు మిషిన్లకు వాడే సూదులు, సైకిల్ సీట్లు, పెడళ్లు వంటి యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేసేది. ఆ కంపెనీ యజమాని మరణించిన తర్వాత కుమారులు ఆ కంపెనీలో పలు మార్పులు తీసుకొచ్చారు. టౌన్సెండ్ బ్రాండ్తో సైకిళ్లను తయారు చేసి విక్రయించారు. కానీ 1891 వచ్చేసరికి ఆ కంపెనీ అప్పుల పాలైంది. దీంతో వాళ్లు ఆ కంపెనీని ఆల్బర్ట్ ఈడీ, ఆర్డబ్ల్యు, స్మిత్లకు అమ్మేశారు. ఆ సమయంలో వారు కంపెనీ పేరును ది ఈడీ మ్యాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీ లిమిటెడ్గా మార్చేశారు. ఆ తర్వాత వాళ్ల దశ తిరిగిపోయింది. నష్టాల్లో ఉన్న ఆ కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రాయల్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ నుంచి ఆర్డర్లు వచ్చాయి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కోసం తుపాకులు, యుద్ధ సామగ్రి, విడిభాగాలను ఉత్పత్తి చేసేవారు. గవర్నమెంట్ ఆర్డర్లు రావడంతో 1893లో తమ కంపెనీ పేరును రాయల్ ఎన్ఫీల్డ్ మ్యాన్యుఫ్యాక్షరింగ్ లిమిటెడ్గా మార్చేశారు. ఆ తర్వాత ఎన్ఫీల్డ్ పేరుతో సైకిళ్లను తయారు చేశారు. 1901లో నాలుగు చక్రాల ఎన్ఫీల్డ్ మోటార్ వాహనాన్ని రూపొందించారు. కానీ వాటి అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అవి వర్కవుట్ కాకపోవడంతో మూడు చక్రాల వాహనాన్ని తీసుకొచ్చారు. అది కూడా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఎన్నో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా ఎన్నో పరిశోధనలు చేసి 1907లో తొలిసారిగా రెండు చక్రాల మోటార్ సైకిల్ను రూపొందించింది.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ఫీల్డ్ వాహనాలను భారీగా కొనుగోలు చేసింది. ఆ వాహనాలు సక్సెస్ కావడంతో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి రకరకాల మోడళ్లను రిలీజ్ చేశారు. 1930లోపు దాదాపు 13 రకాలు కొత్త మోడల్స్ తీసుకొచ్చారు. నాలుగు వాల్వులు, సింగిల్ సిలిండర్తో తయారైన బండిని బుల్లెట్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్లు తమ రాజసానికి చిహ్నంగా బుల్లెట్ బండిని భారత్కు తీసుకొచ్చారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేఆర్ సుందరం అయ్యర్, కే ఈశ్వరన్లు 1948లో మద్రాస్ మోటార్స్ను నెలకొల్పి రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్ని ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకుని అమ్మేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిహద్దులను గస్తీ కాయడానికి ఆర్మీ జవాన్లు ట్రయంఫ్, బీఎస్ఏ వంటి మోటార్ సైకిళ్లను వాడేవారు. కానీ గుట్టలు, గతుకుల రోడ్లలో అవి అంత అనుకూలంగా ఉండేవి కాదు. దీంతో జవాన్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో ఆ బైకుల స్థానంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్ని జవాన్లకు అందజేయాలని 1949లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రాంతాల్లో సౌకర్యంగా ఉండటంతో జవాన్లకు బాగా నచ్చేశాయి. కానీ ఇంగ్లండ్ నుంచి మోటార్ సైకిళ్లను దిగుమతి చేసుకోవడం భారంగా ఉండేది. దీంతో వాటిని ఇండియాలోనే తయారు చేసేందుకు 1955లో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీతో మద్రాస్ మోటార్స్ ఒప్పందం చేసుకుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇంజిన్ సౌండ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సౌండ్కే యువత పడిపోతారు. కానీ ఈ బండి మైలేజి చాలా తక్కువ. అప్పట్లో పెట్రోల్ను మంచినీళ్లలా తాగేసేది. దీంతో పెట్రోల్ ధరలు పెరిగినా కొద్దీ బుల్లెట్ బండిని వాడటం భారంగా మారింది. దీనికి తోడు 1977 తర్వాత పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ బైక్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలను ఆకర్షించేందుకు డీజిల్ బుల్లెట్ బండిని తీసుకొచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. కానీ అది అంతలా సక్సెస్ కాలేదు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల నుంచి ఆధునాతన మోడల్ బైక్స్ వచ్చేశాయి. ఆ ఎఫెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థపై భారీగానే పడింది. దీంతో ఇంగ్లండ్లోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెని దివాళా తీసింది. ఈ క్రమంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా కంపెనీ.. కేఆర్ సుందరం కొడుకుల చేతిలోకి వెళ్లిపోయింది.
అప్పటికి ఇండియాలోకి వివిధ కంపెనీల బైకులు రావడం పెరిగిపోయింది. ముఖ్యంగా జావా, రాజ్దూత్ బైకులు యూత్కు తెగ నచ్చేశాయి. హమారా బజాజ్ పేరుతో వచ్చిన చేతక్ బండ్లు మధ్య తరగతి కుటుంబాలను ఆకట్టుకున్నాయి. వీటి తర్వాత హీరో హోండా, బజాజ్ కవాసాకి, యమహా వంటి బైకులు ఇండియన్ మార్కెట్ను ఆక్రమించేశాయి. దీంతో బుల్లెట్ బండి వాడకం తగ్గిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని మళ్లీ జనాలకు చేరువ చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి. 1994లో ఒకానొక సమయంలో ఇక రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ మనుగడ కష్టమని అంతా కష్టమని అనుకున్నారు. అలాంటి సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని ఐషర్ మోటార్స్ యజమాని సిద్ధార్థ్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బుల్లెట్ బండికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. యువతను ఆకట్టుకునేలా మోడళ్లను తీసుకొచ్చారు. చివరకు మళ్లీ యూత్ను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ బుల్లెట్ బండికి ఆ పాత రాజసం వచ్చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !