కొండాపూర్, ఆగస్టు 4 : చెత్త సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్న కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటూ మియాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు మంగళవారం ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు ఆందోళన చేపట్టారు. రాంకీ సంస్థ తీరును వ్యతిరేకిస్తూ ‘రాంకీ వద్దు… సీఎంసీ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. కార్మికుల కథనం ప్రకారం.. గతంలో దీప్తిశ్రీ నగర్ డంప్ యార్డులో చెత్తను పోసి అక్కడే ప్లాస్టిక్, అట్టలు, సీసాలు వంటి స్క్రాప్ను వేరు చేసుకుని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందేవారు.
అయితే ప్రస్తుతం డంప్ యార్డులో చెత్త వేరు చేయడానికి అనుమతించడం లేదని, చెత్తను నేరుగా డంప్ చేసి వెళ్లిపోవాలని రాంకీ సంస్థ అధికారులు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. జోనల్ హెడ్ రామకృష్ణ, అశోక్ రెడ్డి హ్యూమన్ రైట్స్ పేరుతో డంప్ యార్డులో చెత్త వేరు చేయడాన్ని నిలిపివేస్తున్నారని, “ఎక్కడి చెత్త అక్కడే సెగ్రిగేషన్ చేయాలి, డంప్ యార్డులో చేయొద్దు” అని హెచ్చరిస్తున్నారని కార్మికులు తెలిపారు.
అపార్ట్మెంట్లు, కాలనీల్లో చెత్త వేరు చేసుకునేందుకు తగిన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దాదాపు వెయ్యి మంది చెత్త సేకరణ కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఇంటింటి చెత్త సేకరణ ద్వారా వచ్చే పారితోషికం కుటుంబ పోషణకు సరిపోదని, స్క్రాప్ విక్రయాల ద్వారానే జీవనం కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నామని, అయినప్పటికీ తమ ఉపాధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని అన్నారు.
ఈ సమస్యపై రాంకీ సంస్థ అధికారులను ప్రశ్నించగా, ‘సీఎంసీ అధికారులతో మాట్లాడుకోవాలి, మాకు తెలియదు’ అనే సమాధానం ఇస్తున్నారని కార్మికులు పేర్కొన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. తమకు వెంటనే న్యాయం చేయాలని, డంప్ యార్డులో చెత్త వేరు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసిన కార్మికులు, సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.