ఈ సృష్టిలో ప్రేమ చాలా గొప్పది ! మనసిచ్చిన వ్యక్తితో కలిసి ఉంటే వచ్చే ఆనందం ముందు.. ఎన్ని కోట్లు ఉన్నా దిగదుడుపే !! ప్రేమించిన వ్యక్తితో పూరి గుడిసెలో ఉండి పచ్చడి మెతుకులు తిన్నా కూడా పరమాన్నం తిన్నట్టే ఉంటుంది !! ఇలాంటి డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. కానీ అది అక్షర సత్యమని నిజజీవితంలో చాలామంది నిరూపించారు. తాము ఇష్టపడిన వ్యక్తులతో జీవితాన్ని పంచుకోవడం కోసం కోట్ల సంపదను రాజరికాన్ని, రాజభోగాలను తృణప్రాయంగా వదులుకున్నారు. రాజ్యాలను వదులుకుని పలువురు యువరాజులు, యువరాణులు సామాన్య వ్యక్తుల్లా సాధారణ జీవితాన్ని గడిపారు. అలా ప్రేమించి పెళ్లాడిన మేఘన్ మార్కెల్తో సంతోషంగా జీవించాలని ప్రిన్సెస్ హ్యారీ బ్రిటీష్ రాజవంశం నుంచి ఇటీవల బయటకొచ్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తమ ప్రేమికుల కోసం హ్యారీ లానే రాజరిక హోదాను వదులుకున్నవారు ఇంకా చాలామందే ఉన్నారు.. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..
బ్రిటీష్ రాజవంశంలో జన్మించిన ప్రిన్స్ హ్యారీ.. ఇటీవల రాజ కుటుంబం నుంచి బయటకు రావడం సంచలనం సృష్టించింది. నిజానికి ఆయన పెండ్లి చేసుకుంటానంటే సంబంధం కలుపుకోవడానికి ప్రపంచంలోని ఎన్నో రాజవంశాలు సిద్ధంగా ఉంటాయి. కానీ హ్యారీ మాత్రం సంపద తెచ్చే యువతి కంటే ప్రేమించిన అమ్మాయితో జీవితం పంచుకోవడంలోనే అసలైన సంతోషం ఉందని భావించాడు. అందుకే అమెరికన్ మోడల్ మేఘన్ మార్కెల్ను 2018లో ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కానీ స్వతంత్ర జీవనానికి అలవాటు పడిన మేఘన్.. అంతఃపుర ఆంక్షలు, నిబంధనల మధ్య ఇమడలేకపోయింది. రాజభోగాలు అనుభవిస్తున్నా సంతోషంగా ఉండలేకపోయింది. ఇలాంటి అనుభవాలే ప్రిన్స్ హ్యారీకి కూడా ఎదురయ్యాయి. దీంతో తన అర్ధాంగితో కలిసి రాజవంశం నుంచి బయటకొచ్చేశాడు. సాధారణ పౌరుల్లా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రేమించే భార్య, బిడ్డల భవిష్యత్తు కోసమే తాను రాజవంశం నుంచి బయటకొచ్చేసినట్లు.. ప్రిన్స్ హ్యారీ అప్పట్లో ఒక టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రస్తుత బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పెద్దనాన్న కింగ్ ఎడ్వర్డ్ VIII కూడా ప్రేమించిన అమ్మాయి కోసం బ్రిటన్ సింహాసనాన్ని వదులుకున్నాడు. కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ దంపతులకు 1894 జూన్ 23న కింగ్ ఎడ్వర్డ్ VIII జన్మించాడు. పెద్ద కుమారుడు కావడంతో 1936 జనవరి 20న బ్రిటీష్ రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనం అధిష్టించాడు. కానీ అప్పటికే ఆయన అమెరికా పౌరురాలైన వాలీస్ సిమ్సన్తో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెండ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాడు. అయితే వాలీస్ సిమ్సన్కు అప్పటికే రెండుసార్లు పెండ్లి అయింది. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. అలాంటి మహిళ బ్రిటీష్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని ఎడ్వర్డ్ VIII తల్లిదండ్రులు, రాజకుటుంబీకులు దాన్ని వ్యతిరేకించారు. అయినా సరే సిమ్సన్నే పెండ్లి చేసుకుంటానని ఆయన పట్టుబట్టాడు. ఒకవేళ సిమ్సన్ను పెండ్లాడితే సింహాసనాన్ని వదులుకోవాల్సి ఉంటుందని రాజకుటుంబీకులు హెచ్చరించారు. కానీ ప్రేమించిన అమ్మాయి ముందు రాజభోగాలు ఆయనకు చాలా చిన్నవిగా కనిపించాయి. దీంతో చక్రవర్తి పీఠాన్ని వదిలేసి సిమ్సన్ను పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ సోదరుడు జార్జ్ VI బ్రిటన్కు రాజయ్యాడు.
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II కోసం ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కూడా తన రాజ్యాన్ని వదులుకున్నాడు. డెన్మార్క్ ప్రిన్స్ అండ్రూ, ప్రిన్సెస్ అలీస్ దంపతులకు ఫిలిప్ గ్రీన్ జన్మించాడు. ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాల్లో చదువుకున్న ఫిలిప్ 1939లో రాయల్ నేవీలో చేరాడు. ఫిలిప్ పనితీరు నచ్చిన జార్జ్ VI తన కుమార్తె ఎలిజబెత్ IIను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. అయితే ఫిలిప్.. ఎలిజబెత్ IIను వివాహం చేసుకోవాలంటే ఒక నిబంధన ఉంది. ఆయన కచ్చితంగా బ్రిటన్ పౌరుడిగా మారాల్సి ఉంటుంది. ఎలిజబెత్ IIను ఇష్టపడిన ఆయన.. ఆమె కోసం గ్రీన్, డెన్మార్క్ రాచరిక వారసత్వాన్ని వదులుకున్నాడు. 1947లో ఎలిజబెత్ IIను పెండ్లి చేసుకుని రాయల్ కుటుంబంలో చేరి ఎలిజబెత్కు భర్త అయ్యాడు. ఫిలిప్కు నైట్ ఆఫ్ ది గార్డర్, బారాన్ గ్రీన్విచ్, ఎర్ల్ ఆఫ్ మెరియనెత్, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ టైటిల్స్ కూడా ఇచ్చారు.
స్వీడన్ చక్రవర్తి కింగ్ గుస్తఫ్ VI అడాల్ఫ్ కుమారుడైన కార్ల్ జోహాన్ కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్నాడు. జర్నలిస్ట్ ఎలిన్ కెర్సెటిన్ మార్గరెటాను కార్ల్ జోహాన్ ప్రేమించాడు. కానీ వారి పెండ్లికి స్వీడన్ రాజకుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ఎలిన్ కోసం రాజకుమారుడి హోదా, వారసత్వ హక్కులు అన్నింటినీ వదులుకున్నాడు. రాజకుటుంబం నుంచి బయటకొచ్చి 1946లో మార్గరెటాను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత న్యూయార్క్లో స్థిరపడిన కార్ల్ జోహాన్.. అక్కడ ఒక ట్రేడింగ్ కంపెనీలో పనిచేశాడు. అయితే 1987లో కెర్సెటిన్ మరణించడంతో మరుసటి ఏడాది స్వీడన్కు చెందిన గున్నిలా మార్టా లూయిస్ను రెండో పెండ్లి చేసుకున్నాడు.
డచ్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఫ్రిసో కూడా ప్రేమించిన అమ్మాయితో జీవితం గడిపేందుకు రాజభోగాలను కాదనుకున్నాడు. ఈయన నెదర్లాండ్స్ చక్రవర్తి కింగ్ విలియమ్ అలెగ్జాండర్ సోదరుడు. 2004లో మానవ హక్కుల కార్యకర్త మాబెల్ విస్సేతో ప్రిన్స్ ఫ్రిసో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే తమ స్థాయికి తగ్గ మహిళను వివాహం చేసుకోలేదనే కారణంతో ఆయనను రాజ కుటుంబం నుంచి వెలేశారు. ప్రేమ కోసం ప్రిన్స్ ఫ్రిసో రాజరిక, వారసత్వ హక్కులను వదులుకొని సాధారణ జీవితం మొదలుపెట్టాడు. అయితే 2012లో ఆస్ట్రియాలోని లెచ్ వద్ద స్కీయింగ్ చేస్తుండగా హిమపాతంలో ఇరుక్కుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన ఆయన 2013 ఆగస్టు 12న మరణించాడు.
యువరాజులే కాదు ప్రేమించిన అబ్బాయిల కోసం రాజరికాన్ని వదులుకున్న యువరాణులు కూడా ఉన్నారు. వారిలో దాదాపు జపాన్ నుంచే ఉండటం గమనార్హం.
జపాన్ రాజవంశంలోని చట్టాల ప్రకారం.. రాజకుటుంబీకులు ఎవరైనా సామాన్య వ్యక్తుల్ని పెండ్లి చేసుకుంటే వారు తమ వారసత్వాన్ని కోల్పోతారు. ఈ విషయం తెలిసినా కూడా జపాన్ చక్రవర్తి హిరోహిటో కుమార్తె, యువరాణి అత్సికో.. ఒక పాడిరైతును ఇష్టపడింది. అతనితో జీవితాన్ని పంచుకోవడం కోసం రాజకుటుంబంలో స్థానాన్ని వదులకుంది. 1952లో టాకామసా ఇక్డా అనే పాడి రైతును వివాహం చేసుకుంది.
జపాన్ ప్రస్తుత చక్రవర్తి అకిహిట్-రాణి మిచికో దంపతుల ఏకైక కుమార్తె సయాకో ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ ఆమె అర్బన్ ప్లానర్ అయిన మోషిని కురోడాను ప్రేమించింది. కానీ వారి పెండ్లికి జపాన్ చక్రవర్తి ఒప్పుకోలేదు. దీంతో 2005లో యువరాణి హోదాను వదులుకున్న ఆమె.. కురోడాను పెండ్లి చేసుకుంది.
జపాన్ రాజకుమారుడు నోరిహిటో- హిసాకో దంపతుల గారాల పట్టి అయాకో కూడా ఒక సాధారణ వ్యక్తిని ప్రేమించింది. షిప్పింగ్ కంపెనీలో పనిచేసే కె. మోరియాను ఆమె ఇష్టపడింది. అతనితో పెండ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. 2018లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కానీ ఇతర రాజకుటుంబీకులు మాత్రం వీరి వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని బహిష్కరించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రిన్సెస్ అయాకో.. రాజ కుటుంబం నుంచి బయటకొచ్చేసింది.
జపాన్ రాకుమారి సయాకో తరహాలోనే ఆమె మేనకోడలు ప్రస్తుత యువరాజు పుమిహిటో కుమార్తె మేకో కూడా ఒక సాధారణ వ్యక్తిని ప్రేమించింది. కెయి కొమురోను ఆమె ఇష్టపడింది. వీరిద్దరి పెండ్లికి పెద్దలు అంగీకరించారు. వీరి పెండ్లి గురించి 2017లోనే మీడియా ముందు బహిరంగ ప్రకటన కూడా చేశారు. త్వరలోనే వీళ్లు పెండ్లి చేసుకోబోతున్నారు. అయితే రాజరిక చట్టాల ప్రకారం మాత్రం పెండ్లి తర్వాత మేకో.. తన రాజరిక వారసత్వాన్ని కోల్పోనుంది.
థాయిలాండ్ చక్రవర్తి భూమిబోల్ అదుల్యదేజ్ కుమార్తె అయినా బోల్ రత్నా రాజకన్యా కూడా సాధారణ వ్యక్తికి తన మనసిచ్చింది. 1972లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న సమయంలో పీటర్లాడ్ జెన్సెస్ను ప్రేమించింది. ఇదే విషయం తల్లిదండ్రులకు చెబితే వారు ఒప్పుకోలేదు. అయినప్పటికీ పెద్దలను ఎదిరించి ఆమె పీటర్ను పెండ్లి చేసుకుంది. దీంతో ఆగ్రహించిన భూమిబోల్.. కుమార్తెను రాజకుటుంబం నుంచి బహిష్కరించాడు. దీంతో ఆమె తన వారసత్వ హక్కులను వదులుకొని అమెరికాకు వచ్చేసింది. అయితే.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో మనస్పర్థలు రావడంతో 1998లో పీటర్కు విడాకులు ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
బ్రిటన్ రాజకుటుంబంలో మన గౌరమ్మ.. క్వీన్ విక్టోరియా దత్తపుత్రిక గురించి తెలుసా?
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !