హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఉద్యమ సహచరుడు, సోదర సమానుడు పెద్ది సుదర్శన్రెడ్డి మరణవార్త కలచివేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మృత్యువును జయించి తిరిగివస్తారనే ఆశతో అంతా ఎదురుచూశామని, కానీ ఆయన ఇక మన మధ్యలేరన్న వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల అభ్యున్నతికి నిరంతరం తపించిన నాయకుడిగా, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో శ్రమించిన సోదరుడిగా సుదర్శన్రెడ్డి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్కు, తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తీరనిలోటని అభివర్ణించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు, బంధు మిత్రులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారికి ఈ విషాద పరిస్థితులను తట్టుకొనే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ఆకాంక్షించారు.