ఢిల్లీ: భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పు హాకీ ఇండియా(హెచ్ఐ) లో రచ్చ రేపింది. కలర్ ఛేంజ్పై మొదట తమ చర్యను సమర్థించుకున్న అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తాజాగా యూటర్న్ తీసుకున్నాడు. దీనిపై అసలు తనకు సమాచారమే లేదని, ఎగ్జిక్యూటివ్ బోర్డ్లో చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొనడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డులో చర్చించకుండానే, తనకు ముందస్తు సమాచారం లేకుండానే అమలుచేశారని పేర్కొన్నాడు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ హెచ్ఐ అధికారులను ఆదేశించాడు. ఇదిలాఉండగా హెచ్ఐ కార్యదర్శి భోలానాథ్ సింగ్ మాత్రం.. ‘ఈ విషయంపై మేం అంతర్గతంగా చర్చించుకున్నాం. అందరు అధికారులకు దీనిపై పూర్తి అవగాహన ఉంది. అసలు ఇది ఇంత చర్చకు దారితీస్తుందని మేం ఊహించలేదు. జెర్సీ రంగు మార్పుపై మాకు పైనుంచి ఒత్తిడేం లేదు. అనవసరంగా దీనిని రాజకీయం చేస్తున్నారు’ అని చెప్పాడు. కాగా నీలం నుంచి కాషాయానికి మార్చిన అంశంలో ఆటగాళ్లందరికీ సమాచారమిచ్చామని హెచ్ఐ తెలిపినా ఓ ఆటగాడు తనకు దానిగురించి తెలియదని చెప్పడం కొసమెరుపు.