Cyber trafficking | ‘రాణి ఎప్పుడు దారికి వస్తుందా?’ అని ఎరవేసి ఎదురుచూస్తున్నది సైబర్ ట్రాఫికింగ్ ముఠా. ఒకవైపు అవయవాల కోసం డబ్బులిచ్చిన వ్యక్తుల నుంచి ఫోన్ టార్చర్. మరోవైపు రాణి అనే అమ్మాయి తన మనసు మార్చుకొని ఎప్పుడు రైలెక్కి వస్తుందా? అనే ఎదురుచూపులు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఎప్పటినుంచో ఇంట్లోవాళ్లపై కసి, కోపం పెంచుకున్న రాణెమ్మ.. అమ్మానాన్నలతో గొడవపడింది. ఆన్లైన్ స్నేహితుల సలహా అడిగింది. ఆ తర్వాత?
‘అమ్మానాన్నల్ని దారిలోకి తెచ్చుకోవాలంటే ఒకటే దారి. పారిపోతానని బెదిరించాలి. రెండ్రోజులు కనిపించకపోతే వాళ్లే దిగొస్తారు. మా దగ్గరికి వచ్చెయ్. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం’ అంటూ నమ్మబలికారు. ఆ ఐడియా భలేగా నచ్చింది. మరో ఆలోచన లేకుండా.. రైలెక్కేసింది. ప్రేమ నటిస్తూ రిసీవ్ చేసుకున్నారు ఆన్లైన్ దోస్తులు. ఆ రాత్రికి మంచీచెడు మాట్లాడారు. ఆహారంలో మత్తుమందు కలిపి పెట్టారు. ఆమె ఫోన్ ధ్వంసం చేశారు. రాణిని అక్కడినుంచి వేరే చోటికి తీసుకెళ్లారు. అవసరమైన అవయవాలన్నీ తీసుకున్నారు. ఓ పదిరోజుల తర్వాత, రాణి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. ‘మధ్యప్రదేశ్లో రైలుకు ఎదురెళ్లి మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది. శరీరం నుజ్జు నుజ్జు అయింది’ అని చెప్పారు. ‘క్షణికావేశంలో ఇలా ప్రాణం తీసుకున్నవా బిడ్డా’ అంటూ బోరుమన్నారు తల్లిదండ్రులు. అవయవాల అక్రమ రవాణాతో వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ మరో అమాయకురాలి కోసం ఎర సిద్ధం చేస్తున్నాయి సైబర్ ట్రాఫికింగ్ ముఠాలు. సగటున గంటకొక్కరు ఆ వలలో పడుతూనే ఉంటారు.
మానవ అక్రమ రవాణా ( human trafficking ), అవయవాల అక్రమ రవాణా ( organ trafficking ).. ఇలా అనేక చీకటి వ్యాపారాలు. టీనేజ్ అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుని.. అమాయకులను దారి తప్పించి వేశ్యా గృహాలకు, విదేశాలకు రవాణా చేయడానికి, మూత్రపిండాలు తదితర అవయవాలు విక్రయించుకోడానికి ఆన్లైన్ను వేదికగా మార్చుకుంది సైబర్ ట్రాఫికింగ్ ముఠా. అమాయకుల ఫోన్లలో మాల్వేర్ను చొప్పించి.. పోస్టులు, చాటింగ్లు, ఫొటోలు దొంగిలించి.. బలహీనతలు తెలుసుకుంటున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం స్నేహితుల్లా నటిస్తూ.. విలువైన బహుమతులు పంపుతూ.. అందచందాలను పొగుడుతూ.. దారికి రాగానే గొర్రెల్లా అమ్మేస్తున్నారు. అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్నారు. నిరాశ, పేదరికం, ప్రేమ వైఫల్యం తదితర కారణాలతో మానసికంగా బలహీనంగా ఉన్నవారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు ఆ సైబరాసురులు.
సైబర్ ట్రాఫికింగ్ పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి. ఇప్పటికే పోలీసు విభాగాలు, ఎన్జీవోలు, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు సైబర్ నేరాలు, ట్రాఫికింగ్పై జనంలో అవగాహన కల్పిస్తున్నాయి. ఇలాంటి విషయాల పట్ల తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలి. 100, 1098, 1930 వంటి టోల్ఫ్రీ నంబర్లు ఎలా పనిచేస్తాయో పిల్లలకు వివరించాలి. కౌమార బాలబాలికల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. అసాధారణ మార్పులు కనిపిస్తే .. ఆన్లైన్ లైంగిక వేధింపులకు గురవుతున్నారా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? అన్నది పరిశీలించాలి. సోషల్ మీడియా, వీడియో చాట్ అనర్థాలను సవివరంగా తెలియజేయాలి. విద్యాసంస్థలు సైతం ‘డిజిటల్ సంక్షేమం’పై విస్తృతంగా చర్చలు జరపాలి.
☛ సోషల్ మీడియాలో సురక్షితంగా ఉండటం ఎలాగో తెలుసుకోండి.
☛ తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వడం ముఖ్యం. ముక్కూ మొహం తెలియని వారితో పరిచయాలు ఎప్పటికైనా అనర్థమే.
☛ ఆన్లైన్లో మీ భావోద్వేగాలు, ఆలోచనలు వ్యక్తపరచడం ప్రమాదం. అదే అదనుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సైబర్ దొంగలు.
☛ ఈ-మెయిల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగించాలనుకుంటే టూస్టెప్ వెరిఫికేషన్ను ఎంచుకోండి.
☛ సొంతంగా ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకోకుండా.. తల్లిదండ్రులు, పెద్దల మెయిల్స్ను ఉపయోగించండి.
☛ మీ స్క్రీన్ సమయం చాలా తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. కాలక్షేపానికి పుస్తక పఠనం ఉత్తమ మార్గం.
☛ ఆన్లైన్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు సెక్యూరిటీ ఫీచర్స్ తెలుసుకోండి. నియమ నిబంధనలు అర్థంచేసుకోండి.
☛ మీరు ఉపయోగించే యాప్లు, బ్రౌజర్లు, సోషల్ చానెల్స్ చూసేందుకు తల్లిదండ్రులకూ అవకాశం ఇవ్వండి.
☛ సైబర్ నేరస్థుల బారిన పడితే.. https://cybercrime.gov.in/కు ఫిర్యాదు చెయ్యండి. బాధితుల హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చెయ్యండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్నౌ ఫౌండేషన్
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయా?
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త