5G sim upgreade scam | ముంబైకి చెందిన రమేశ్ రాథోడ్కు టెక్నాలజీ అప్డేట్స్ అంటే పిచ్చి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేసేవాడు. బాగా ఉన్న ఫ్యామిలీ కాబట్టి, అప్పుల్లేవు. వచ్చేదంతా రాబడే. సైబర్ నేరాల గురించి అవగాహన ఉన్నవాడే. ఓ రోజు రాత్రి 5జీ నెట్వర్క్ గురించి, స్పీడు, డౌన్లోడ్ సామర్థ్యం గురించి, ఇతర ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేశాడు. ఎప్పుడెప్పుడు 5జీ వాడుకుందామా? అని ఆత్రుతతో ఉండేవాడు. ఇటీవల 5జీ నెట్వర్క్ ప్రారంభానికి ముందు.. తన సిమ్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఓ కాల్ వచ్చింది. ‘సర్.. మీరు 4జీ నుంచి 5జీ మారాలనుకుంటున్నారా?’ అని అడిగారు. ‘అవును’ అని ఉత్సాహంగా చెప్పాడు. కాసేపు మాటల్లో పెట్టి ‘మీకు ఓ లింక్ పంపిస్తాం. దాని ద్వారా మీరు 5జీకి అప్గ్రేడ్ కావచ్చు’ అంటూ, ఓ లింక్ పంపారు. క్షణం ఆలస్యం చేయకుండా లింక్ ఓపెన్ చేశాడు. ఇంటి అడ్రస్, ఫొటో, ఆధార్, పాన్ వివరాలు ఇచ్చేశాడు. అప్గ్రేడేషన్ కోసం ఓటీపీ కూడా ఇచ్చేశాడు. అంతే.. అతని అకౌంట్ను క్షణాల్లో ఊడ్చేశారు సైబర్ దొంగలు. ఇన్నాళ్లూ అప్రమత్తంగా ఉన్న రమేశ్.. అత్యుత్సాహానికిపోయి సంపాదించినదంతా సమర్పించుకున్నాడు. కొద్దిసేపటికే అతని సిమ్ బ్లాక్ అయింది. అదే నంబర్తో సైబర్ దొంగలు మరో సిమ్ తీసుకొని, దానికి లింక్ అయిన మరో బ్యాంకు ఖాతాను కూడా కొల్లగొట్టారు. ఆ అకౌంట్ నుంచి ఎంతెంత డబ్బులు కట్ అయ్యాయో.. మెయిల్ ఓపెన్ చేసి చూస్తేగాని తెలియలేదు. లబోదిబోమంటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ దొంగలకు 5జీ నెట్వర్క్ ఓ వరంలా కనిపించింది. దీంతో అమాయకుల నుంచి చదువుకున్నవారి వరకు.. అందర్నీ మోసం చేస్తున్నారు. తెలివిగా ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. నెట్వర్క్ గురించి చెబుతారు. మాటల్లో దింపి మన 4జీ సిమ్ను 5జీకి అప్డేట్ చేస్తామని చెబుతారు. లేదంటే సిమ్ పోర్టబిలిటీ ఉపయోగాలు వల్లెవేస్తారు. ఆ వలలో పడ్డామని అర్థమైపోగానే లింక్ పంపి, వివరాలు తెలుసుకొని, ఓటీపీల సాయంతో బ్యాంక్ ఖాతాలు కొల్లగొడతారు. ఒక్కోసారి మనం ఇచ్చిన వివరాలతో పాత సిమ్ బ్లాక్ చేసి, అదే నంబరుతో కొత్త సిమ్ తీసుకుంటారు. దానిద్వారా వారికే ఓటీపీలు వస్తాయి కాబట్టి సులువుగా పనైపోతుంది. అలాంటి అనుమానాస్పద లింకులు ఓపెన్ చేస్తే.. మన ఫోన్ హ్యాక్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టే. డేటా చోరీకి మనమే తాళాలు అందించినట్టే.
📶 5జీ అప్గ్రేడ్ కోసం ప్రత్యేకంగా ఎక్కడా రిజిస్టర్ అవ్వాల్సిన పన్లేదు. 4జీ సిమ్ నుంచే 5జీకి నెట్వర్క్ ప్రొవైడర్లే అప్గ్రేడ్ చేస్తారు.
📶 అధికారిక సిమ్ సర్వీస్ ప్రొవైడర్ల కస్టమర్ కేర్ నుంచి అప్గ్రేడ్ కోసం ఎలాంటి కాల్స్ రావు. ఆ విషయం గుర్తుంచుకోవాలి.
📶 ఎయిర్టెల్ 5జీ ఫ్లస్ ప్లాన్ ఇండియాలోని ఎనిమిది నగరాల్లోనే లైవ్లో ఉంది. జియో సంస్థ ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిలలో ట్రయల్స్ ప్రారంభిస్తున్నది. వీఐ
(వోడఫోన్, ఐడియా) సంస్థలు 5జీ లాంచ్ చేసేందుకు కృషి చేస్తున్నా.. ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. కాబట్టి ఆయా నెట్వర్క్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.
📶 5జీ కోసం ప్రత్యేకంగా యాప్లు, ఖాతాలు అప్డేట్ చేసుకోవాలని వచ్చే మెసేజ్లు, కాల్స్కు స్పందించకండి.
📶 మీకు 5జీ అప్గ్రేడ్ సమాచారం కావాలంటే సిమ్ ప్రొవైడర్ అధికారిక వెబ్సైట్లో కచ్చితమైన వివరాలు తెలుసుకోండి.
📶 ఒకవేళ ఇలాంటి మోసాల బారినపడితే స్థానిక పోలీస్ స్టేషన్లో 24 గంటలలోపు ఫిర్యాదు చెయ్యాలి. లేదంటే www.cybercrime.gov.inలో మీ ఫిర్యాదు నమోదు చెయ్యాలి. వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చెయ్యండి.
ఇప్పటి వరకు నమోదైన సైబర్ మోసాల్లో అతిగా ఆశపడేవారు, బద్ధకస్తులు, అమాయకులే ఎక్కువ. ఇప్పుడు కొత్తగా 5జీ మోసాలు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 13 మెట్రో నగరాల్లోని మొబైల్ వినియోగదారులను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకున్నారు. 4జీ నుంచి 5జీకి సిమ్ అప్డేట్ చేస్తామని నమ్మిస్తారు. ఏపీకే ఫైల్స్, లింక్స్ పంపి మాల్వేర్ను ఫోన్లోకి చొప్పిస్తున్నారు. వాటి ద్వారా వ్యక్తిగత ఫొటోలు, రహస్యాలు, తెలుసుకొని డబ్బు డిమాండ్ చేస్తారు. లేదంటే ఆన్లైన్ లావాదేవీలు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు హ్యాక్ చేస్తారు. యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ పంపి రూ.పది, ఇరవై పంపమంటారు. పంపితే చాలు. క్షణాల్లో మొత్తం దోచేస్తారు. ఒకవేళ మీరు నిజంగానే 4జీ నుంచి 5జీకి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మీ దగ్గర్లోని నెట్వర్క్ ప్రొవైడర్ను కలువండి. ఆథరైజిడ్ కస్టమర్ కేర్కు కాల్ చెయ్యండి. అంతేకాని.. ఎవరో అప్గ్రేడ్ చేస్తామంటే నమ్మకండి. ఈ విషయంలో బద్ధకంగా వ్యవహరిస్తే.. మీ అకౌంట్ గుల్ల అయినట్లే.
– ఎస్. హరినాథ్, ఏసీపీ, సైబర్ క్రైమ్స్-రాచకొండ కమిషనరేట్
✍ అనిల్ రాచమల్ల, ఎండ్నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
“ఇది 5జీ కంటే 100 రెట్లు వేగవంతమైన టెక్నాలజీ.. ప్రత్యేకతలేంటో తెలుసా !”
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి