Cyber Crime Prevention Tips | స్మార్ట్ఫోన్ రూపంలో ప్రపంచం అరచేతిలోకి వచ్చాక కంటికి కనిపించని మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజలఅత్యాశను క్యాష్ చేసుకునేందుకు.. సైబర్ నేరగాళ్లు రంగంలో దిగుతున్నారు. విడతలవారీగా డబ్బులు గుంజుతున్నారు. అసలు, ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఆ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం ఎలా?.. ఇలా అనేకానేక విషయాలను ‘ఎండ్నౌ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్ల ప్రతివారం వివరిస్తారు.
అందంలో, చదువులో, సంపాదనలో స్వాతికి ఎలాంటి లోటూ లేదు. కానీ ఐదోతనమే దూరమైంది. పెండ్లయిన ఆర్నెల్లకే భర్త మరణించాడు. రెండేండ్లు ఒంటరిగానే బతికింది. ఒక్కగానొక్క కూతురు ఒంటరిగా ఉండటాన్ని భరించలేకపోయారు తల్లిదండ్రులు. ఓ పేరున్న మ్యాట్రిమోనియల్ సైట్లో స్వాతి ప్రొఫైల్ అప్లోడ్ చేశారు. నాలుగైదు రోజులైందో లేదో.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి ఓ ఎన్నారై లైన్లోకి వచ్చాడు. మొదట స్వాతి తండ్రితో ఎంతో నమ్మకంగా మాట్లాడాడు. ఆమె నంబర్ తీసుకున్నాడు. వాట్సాప్లో మెసేజ్ చేశాడు. అయిష్టంగానే చాట్ చేసింది స్వాతి. ఓ రోజు నేరుగా కాల్ చేశాడా ఎన్ఆర్ఐ. అతని గొంతులో మాధుర్యం ఆమెను ఆకర్షించింది. తన గురించి, తన ఉద్యోగం గురించి, యూకేలో తన వ్యాపారం గురించి రోజూ కథలు ‘కతలు’గా చెప్పేవాడు. ఆ మాటలకు మురిసిపోయేది స్వాతి. ఒక్కోసారి ఆమె తల్లిదండ్రులతోనూ మాట్లాడేవాడు. స్వాతికి యూకే నుంచి ఖరీదైన బహుమతులూ పంపాడు. క్రమంగా అతనిపై ప్రేమ పెంచుకున్నది స్వాతి. తనే ప్రపోజ్ చేసింది. స్వాతి తల్లిదండ్రులు కూడా ఒప్పుకొన్నారు. వీలైనంత త్వరగా పెండ్లి చేసుకొని, తన దేశానికి తీసుకెళ్తానని మాటిచ్చాడు. తర్వాత ఓ సర్ప్రైజ్ అంటూ.. స్వాతికి కొరియర్ ప్యాకింగ్ వివరాలు వాట్సాప్ చేశాడు. యూకే బహుమతులు, నగలు, విదేశీ కరెన్సీ పంపుతున్నట్లు వీడియో పంపాడు. ఆ మరుసటి రోజే కాల్.. ‘నీ కోసం పంపిన నగలు, డబ్బులు, గిఫ్టులు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అవన్నీ నీ పేరుమీద ఉండటం వల్ల సంబంధిత రుసుము నువ్వే కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం మా నాన్నకు స్ట్రోక్ రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్తున్నాం. ఆ కస్టమ్స్ అధికారి నంబర్ ఇస్తాను. కొంచెం మాట్లాడి, డబ్బులు సర్దు’ అంటూ మెసేజ్ పెట్టాడు.
కన్నీళ్లు దిగమింగుతూనే కస్టమ్స్ అధికారికి కాల్ చేసింది. అతను ‘మీ డిటెయిల్స్ అన్నీ వెరిఫై చెయ్యాలి.. అందుకోసం రూ.లక్ష నగదు చెల్లించాలి’ అని చెప్పడంతో.. వెంటనే చెల్లించింది. ప్రాసెసింగ్ ఫీజు అంటూ మరో రూ.50 వేలు అడిగాడు. నగలకు లైసెన్స్ ఇవ్వడానికి మరో రూ. 70 వేలు కట్టమన్నాడు. అలా విడతల వారీగా, కొత్తకొత్త కారణాలు చెబుతూ.. రూ.10 లక్షల వరకూ వసూలు చేశారు. ఇవన్నీ తండ్రికి తెలియకుండా తన సేవింగ్స్ నుంచి పంపింది స్వాతి. ఆ రోజు సాయంత్రానికే ‘నాన్నకు హార్ట్ ఆపరేషన్. ఆయన్ను హాస్పిటల్కు తీసుకొస్తుండగా పర్స్ ఎక్కడో పడిపోయింది. హాస్పిటల్ వాళ్ల నంబర్ ఇస్తాను.. రూ.5 లక్షలు ఇవ్వగలవా?’ అంటూ దీనంగా అడిగాడు ఎన్ఆర్ఐ. ఎటూ కాబోయే భర్తే కాబట్టి, ఏమాత్రం ఆలోచించకుండా కార్డు నంబర్, ఓటీపీలు చెప్పేసింది. అంతే.. దశలవారీగా అకౌంట్ మొత్తం లూటీ చేశారు. ఇదంతా మోసమని, అతను సైబర్ నేరగాడని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు స్వాతికి. తండ్రి, కూతురు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మరో ఘటనలో ఇలాగే మోసపోయాడు వ్యాపారి సంతోష్.
› రెండో పెండ్లి వారిలో ఉద్యోగం, సామాజిక హోదా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటారు సైబర్ నేరగాళ్లు.
› మ్యాట్రిమొనీ వెబ్సైట్లలో ఇచ్చిన మెయిల్స్ ద్వారా ఆన్లైన్ చాటింగ్ చేస్తారు. నంబర్ దొరికాక వాట్సాప్, ఫోన్ కాల్స్ చేసి మాటలు కలుపుతారు. ప్రేమిస్తున్నట్టు నటిస్తారు.
› పండుగలు, పబ్బాల గురించి అనర్గళంగా ఉపన్యసిస్తారు. మాటలతో వంచిస్తారు.
› పెండ్లికి ఒప్పించిన తర్వాత.. విదేశీ కరెన్సీ, నగలు, బహుమతులు అంటూ ప్యాకింగ్ వీడియోలు, స్క్రీన్షాట్లు పంపుతారు. ధనవంతుల్లా బిల్డప్ ఇస్తూ.. ఫొటోలు పెడతారు.
› కొరియర్ ట్రాప్, ఎయిర్పోర్ట్ ట్రాప్, అనారోగ్యం, వీసా చార్జీలు.. అబద్ధం మీద అబద్ధం అల్లేస్తారు.
› ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మీరు భాగస్వామిని ఎంచుకోవాలని అనుకుంటే.. మొదట చెయ్యాల్సింది వారి ప్రొఫైల్ను క్షుణ్నంగా తనిఖీ చెయ్యడం. ఎక్కడ ఉంటున్నారు? ఏం చదువుకున్నారు? కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ప్రతీది వ్యక్తిగతంగా తెలుసుకోవాలి.
› అతని/ఆమె నేపథ్యం ఏంటి? క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా? వారి ఆర్థిక స్థితి ఏంటి? రుణాలు, సిబిల్ స్కోర్ ఏంటి? అన్నదీ క్షుణ్నంగా తెలుసుకోవాలి.
› కొన్ని మ్యాట్రిమోనియల్ సంస్థలు నిపుణులు ధ్రువీకరించిన ఖాతాలనే డిస్ప్లే చేస్తున్నాయి. అలాంటి ప్రొఫైల్స్ను ఎంచుకోవడం ఉత్తమం. పెండ్లికి మరీ తొందరపెడుతున్నారంటే.. మరింత జాగ్రత్తగా ఉండాలి.
› పెండ్లికి ముందే ఏదో కారణం చెప్పి డబ్బు అడిగితే.. మరో కారణం చెప్పి తప్పించుకోండి.
› మీ సోషల్ మీడియా ఖాతాల వివరాలు, పాస్వర్డ్ బహిర్గతం చేయకండి. ఎవరికైనా ఇస్తే వెంటనే మార్చుకోండి. ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ ద్వారా పంపే లింక్లు క్లిక్ చేయవద్దు.
› ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆన్లైన్ మోసాలకు చిక్కితే, అధైర్యపడకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యండి. 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే.. డబ్బు తిరిగొచ్చే అవకాశం ఉంటుంది. www. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1930 నంబరుకు కాల్ చేయవచ్చు.
“సైబర్ మోసాల్లో తొలి గంట కీలకం!”
“Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి”
“నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి”