సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్/వనస్థలిపురం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మేం ఆన్లైన్ మోసం చేశాం.. ఏమీ చేసుకుంటావో చేసుకో.. అంటూ ఓ బాధితుడికి సైబర్నేరగాళ్లు అల్టిమేటం ఇచ్చారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ మంగళవారం సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన బాధితుడు లోకంటో యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇది డేటింగ్ యాప్. అందులో ఆయుర్వేద మెసేజ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ముందుగా రూ. 2500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తరువాత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అంటూ రూ.40 వేలు తీసుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ అంటూ.. ఇలా రకరకాల పేర్లు చెబుతూ రూ.1.9 లక్షలు కాజేశారు. అయితే మాదాపూర్లో మసాజ్ సెంటర్ ఉందంటూ సైబర్నేరగాళ్లు చెప్పడంతో అక్కడ ఆరా తీశాడు. అలాంటిదేమి లేదంటూ తేల్చుకున్నాడు. తాను మోసపోయానని తన డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. రోజు మేం చేసే పని ఇదే.. ఇలాంటి మోసాలే చేస్తాం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ సైబర్నేరగాళ్లు అల్టిమేటం ఇచ్చి ఫోన్ కట్ చేశారని బాధితుడు పోలీసుల ముందు వాపోయాడు.
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 7 : గూగుల్లో సెర్చ్ చేసి కస్టమర్ కేర్కు ఫోన్ చేసిన దూలపల్లి గంగస్థాన్లో నివాసముండే వన్నెంరెడ్డి నాగవెంకటకృష్ణ సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.94,991 పోగొట్టుకున్నాడు. ఈ విషయమై పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు.
వనస్థలిపురం, డిసెంబర్ 7 : ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని ఫోన్లో యాప్ అప్డేట్ చేసుకోవాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు సరూర్నగర్ వెంకటేశ్వర నగర్లో నివాసముండే దేవరశెట్టి కాంచన అకౌంట్ నుంచి రూ.75వేలు కాజేశారు. బాధితురాలు వనస్థలిపురం పీఎస్లో ఫిర్యాదు చేసింది.