Narsapur | నర్సాపూర్, ఆగస్టు 7 : బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల కథనం ప్రకారం.. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న బండ్లు బోనాల ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో మల్పర్తి హర్షవర్ధన్ (19) విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఘటనలో బోడా అఖిల్, ఇర్ఫాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.