హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్మును రికవరీ చేయడంలో తొలి గంట (గోల్డెన్ అవర్) కీలకపాత్ర పోషిస్తున్నది. బాధితులు గంట లోపే ఫిర్యాదు చేస్తే.. పోయిన సొమ్మును రాబట్టడానికి 80 శాతం అవకాశం ఉంటుందని సైబర్క్రైం పోలీసులు చెప్తున్నారు. జాతీయ గణాంకాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే సైబర్క్రైం రిపోర్టింగ్ పోర్టల్లో లేదా 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇచ్చిన కేసుల్లో 70 నుంచి 80% కేసుల్లో పోలీసులు డబ్బులు తిరిగి రికవరీ చేయగలిగారు.
నేరం జరిగిన రెండు గంటల తర్వాత అందిన ఫిర్యాదుల్లో 15-20% కేసుల్లో మాత్రమే డబ్బు రికవరీ అయ్యింది. ఫిర్యాదులు ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనే అంశంపై అవగాహన లేకపోవడంతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరుగుతున్నది. తమ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ రాగానే బాధితులు స్థానిక పోలీసు స్టేషన్లకు, బ్యాంకు బ్రాంచీలకు వెళ్తున్నారు.
అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలుసుకొని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా గోల్డెన్ అవర్ దాటి పోతున్నది. మరికొందరు కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్లో సెర్చ్ చేసి, మరోసారి సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. కాబట్టి సైబర్ నేరం జరిగిన వెంటనే జాతీయ స్థాయిలో 24 గంటలూ అందుబాటులో ఉండే టోల్ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
టోల్ఫ్రీ నంబర్ 1930కి ఫోన్ చేస్తే టీ4సీ (తెలంగాణ సైబర్క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్)సిబ్బంది స్పందిస్తారు. బాధితులు మోసపోయిన తీరు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి ప్రాథమిక సమాచారం తెలుసుకొని, సైబర్క్రైం పోలీసుల అంతర్గత సైట్ ద్వారా ఆయా బ్యాంకులకు సమాచారాన్ని చేరవేస్తారు. దేశంలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు దీనికి అనుసంధానమై ఉంటారు. కాబట్టి అక్కడి ప్రతినిధులు వెంటనే ఆ డబ్బులు ఏ బ్యాంకు ఖాతాకు చేరాయో గుర్తించి వాటిని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్గా గుర్తించి, డబ్బును ఫ్రీజ్ చేస్తారు. ఇలా మన సొమ్ము మనకు తిరిగి ఇప్పించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే సైబర్ నేరగాళ్లు మన ఖాతా నుంచి కొట్టేసిన నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించి, వాటిని ఏదో ఒక అజ్ఞాత ప్రాంతం నుంచి డ్రా చేసుకునే ప్రమాదం ఉంటుంది. అప్పుడు డబ్బు రికవరీ కష్టమవుతుంది.