Peddi Sudarshan Reddy | స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలలను అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో రూ. 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా మొత్తంగా, 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నది.
అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.