– ప్రజాచైతన్య యాత్రలో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
బూర్గంపహాడ్, ఆగస్టు 07 : గోదావరి వరదల సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ ముంపు మండలమైన బూర్గంపహాడ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం సారపాకకు చేరుకోవడంతో స్థానిక సీపీఐ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మండలంలో ప్రధానంగా ఆదివాసీ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. పోడు గిరిజనులపై అటవీ అధికారులు చేస్తున్న దాడులకు ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. గోదావరి వరదలు వస్తే బూర్గంపహాడ్ మండలం ముంపునకు గురై వేలాది కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారని, ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల నివారణకు మండలంలో కరకట్ట నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించాలన్నారు.
పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న సారపాకలో సుమారు 50 వేల జనాభా ఉన్నా ఆస్పత్రి లేకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం ఇంటర్ కళాశాల కూడా లేదని, తక్షణమే సారపాకలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేరుకే పారిశ్రామిక ప్రాంతమని, అభివృద్ధి విషయంలో మాత్రం శూన్యమన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం ప్రజా చైతన్య యాత్ర చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లారెడ్డి, మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డా), ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నరాటి ప్రసాద్, కార్యదర్శి సబ్కం నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, సీపీఐ ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మల్లికార్జున్, మండల నాయకులు పాల్గొన్నారు.