Life Imprisonment | గాంధీ చౌక్ : హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ బుధవారం తీర్పు వెలువరించారు.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బండనకల్ గ్రామ పరిధిలో 27-12-2020న భూమి సరిహద్దుల వివాదం నేపథ్యంలో కస్తూరి కరుణాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నిందితులు రాంరెడ్డి, వెంకటేష్, మహేష్, మంజులలు కలిసి గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు, నిందితులు నలుగురు నేరం చేసినట్లు నిర్ధారించింది. దీంతో వారికి జీవిత ఖైదు శిక్ష విధించడంతోపాటు ఒక్కొక్కరికి రూ. 6,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.