Chandra Babu : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ క్యాడర్పై అసహనం వ్యక్తంచేశారు. సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. అధికారం వచ్చిందన్న అహంతో ఎవరూ ఇగోలకు పోవద్దని, క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని స్పష్టంచేశారు. టీడీపీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రవర్తనపై కీలక సూచనలు చేస్తూనే మరోవైపు వైసీపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని, మనం సుపరిపాలన అనే యజ్ఞం చేస్తుంటే, మన నేతలే సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుందని బాబు అన్నారు. ప్రజలతో సౌమ్యంగా ఉండాలని, వారికి అందుబాటులో ఉండాలని, నేతలు, కార్యకర్తలు చేసే తప్పులు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్లెక్సీలు, ఫొటోలు, కుర్చీల దగ్గర చిన్నపాటి గొడవలు కూడా రాకూడదని, అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని వార్నింగ్ ఇచ్చారు. గత పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూసే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. బూతులు, దాడులు, సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీ నేతలతో సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు స్పష్టంచేశారు. తాను, పవన్ కల్యాణ్ ఎంతో చక్కగా ఉంటున్నామని, మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇదే స్ఫూర్తి క్షేత్రస్థాయిలోనూ కనిపించాలని అన్నారు. బీజేపీని కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలని చెప్పారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య గ్యాప్ లేదనపి, ఇక ముందు రాకూడదని అన్నారు. తాను లేకుండా ఎంపీ రాకూడదని టీడీపీ ఎమ్మెల్యేలు అనడం సరైన పద్ధతి కాదని, అందరూ మనస్పర్థలు లేకుండా పనిచేయాలని హితవు చెప్పారు.