NHRC | టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లు సిద్దిపేట శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత హరీశ్ రావుపై బహిరంగంగా చేసిన ‘క్షుద్ర పూజలు/తాంత్రిక పూజలు’ నిర్వహించారన్న ఆరోపణలపై, న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయ భారతి సాయనీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. శివమొగ్గ, తిరుచ్చిరాపల్లిలో హరీశ్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారని, తెలంగాణలో వర్షాలు పడకుండా, రైతులు నష్టపోయేలా చేసేందుకే ఈ పూజలు చేశారని గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎలాంటి ఆధారాలు బహిరంగంగా ప్రదర్శించకుండా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే తరహాలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా సామాజిక మాధ్యమాల్లో వీడియో ద్వారా ఇలాంటి ఆరోపణలు చేశారు. రాజ్యాంగబద్ధమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు, ఎలాంటి రుజువులు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఒక ప్రజాప్రతినిధి గౌరవాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని రేవంత్ అభిప్రాయపడ్డారు.
గ్రామీణ తెలంగాణలో నేటికీ క్షుద్ర పూజలు, చేతబడి వంటి మూఢనమ్మకాల కారణంగా అమాయక ప్రజలు హత్యలకు గురైన సంఘటనలు అనేకం జరిగాయని, ప్రభుత్వం, పోలీసు శాఖ ఇలాంటి మూఢనమ్మకాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులే ఇలాంటి ప్రకటనలు చేయడం ఆ ప్రయత్నాలను దెబ్బతీసేలా, సమాజంలో ఇలాంటి నేరాలను ప్రోత్సహించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు పరిశీలించాలని, గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాల ఆధారిత హింసను నివారించే దిశగా ప్రజాప్రతినిధులకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ NHRCకు వినతి పత్రం సమర్పించినట్లు రేవంత్ తెలిపారు.