కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఒక కార్యాలయంలో పనిచేస్తున్న కమలాకర్ పాన్షాప్నకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనాలను తీయాలని కోరాడు. దీంతో యువకులు అతడిపై దాడికి దిగి గాయపర్చారు. యువకుల దాడిలో కమలాకర్ రెండు పక్కటెముకలు విరిగాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ సీఐ విచారణ చేపట్టారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న కమలాకర్ నుంచి పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటివల వరుసగా రెండు, మూడు ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.