వినాయక్నగర్, ఏప్రిల్ 25: తెలంగాణలో తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో గురువారం నిర్వహించిన బీజేపీ బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు.
దేశంలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఆ పార్టీ హస్తం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించే పంటపై సైతం పన్ను విధిస్తుందన్నారు. సభలో ఎంపీ అర్వింద్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, ఉత్తరాఖండ్ మంత్రి విజయ్ రోహిలా, నాయకులు పాల్గొన్నారు.
సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలోని వెనుకభాగం పూర్తిగా ఖాళీ అయ్యింది. 12.30 గంటలు దాటినా నేతలురాకపోవడంతో జనాలు పడిగాపులు కాశారు. సీఎం ప్రసంగం మొదలయ్యేసరికి జనాలు వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.