NIMZ | జహీరాబాద్, ఆగస్టు 1: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో నిమ్జ్ (NIMZ) ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రామంలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది.
గత పదేళ్లుగా నిమ్జ్ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దంటూ రేజింతల్ రైతులు నిరసనలు చేపడుతున్నారు. భూసేకరణ వల్ల తమ జీవనాధారం దెబ్బతింటుందని, ఇది భూ సేకరణ, పునరావాసం, పునర్వ్యవస్థీకరణ హక్కు చట్టం-2013 స్ఫూర్తికి విరుద్ధమని మొదటి నుంచే వాదిస్తున్నారు. ఈ అంశంపై పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ తదితర అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా, గతంలో భూసేకరణపై స్టే లభించింది.
అయితే, స్టే ఉన్నప్పటికీ కేసులు వేసిన రైతుల పేర్లను మినహాయించి, మిగిలిన 566.12 ఎకరాల భూముల సేకరణకు ఈ ఏడాది జనవరిలో నిమ్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై మళ్లీ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజకీయ ఒత్తిళ్లతో భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
వాదనలు విన్న హైకోర్టు, రేజింతల్ గ్రామానికి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిమ్జ్ అధికారులు కూడా సంబంధిత నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన బాధిత రైతులు భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తమ హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సారవంతమైన వ్యవసాయ భూములను పరిశ్రమల పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు.