ఎల్లారెడ్డి, ఏప్రిల్ 25: అబద్ధాలు, మోస పూరిత ప్రకటనలు, ఇతర పార్టీల నాయకులను బెదిరింపులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నాగిరెడ్డిపేట, లింగంపేటలో జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి గురువారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతోపాటు వందలాది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పింఛన్ పెంపు, మహిళలకు రూ.2,500, నిరుద్యోగభృతి వంటి హామీలను గాలికి వదిలేసిందన్నారు. నిరంతర విద్యుతు సరఫరా లేక పోవడంతో పంటలు దెబ్బతిని వేలాది మంది రైతులు నష్టపోయారని తెలిపారు. రైతుల, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలంటే లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో కొట్లాడాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. మన రాష్ట్ర హక్కుల కోసం తాను పోరాటం చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఓ వసూల్ రాజాలా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. నియోజక వర్గంలో కనిపించకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా కార్పొరేట్ రాజకీయం చేస్తున్నాడని అన్నారు. క్వారీల నుంచి రూ.కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, కొంత మంది నుంచి పెద్దమొత్తం డబ్బులు వసూలు చేశారని తెలిసిందని ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా తన వ్యాపార పనుల కోసమే ఎక్కువ సమయంలో కేటాయిస్తున్నారని మండిపడ్డారు.