ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 25: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడప గడపకూ వివరించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ..కార్యకర్తలకు సూచించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించనున్నదని, ఇప్పటికే గులాబీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ తిరుమల గార్డెన్లో గురువారం నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డితో కలిసి బాజిరెడ్డి హాజరై మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిందన్నారు. ఆరు గ్యారంటీల పేర్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమలుచేయడం లేదని మండిపడ్డారు. ఆ పథకాలను అమలుచేయలేక సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేసే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని అంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి కేసీఆర్ పాలనలో జరిగిందని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి బాజిరెడ్డి గోవర్ధన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, ఆర్మూర్ జడ్పీటీసీ సంతోష్, నాయకులు పాల్గొన్నారు.