Afghanistan : ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) 2027 వన్డే ప్రపంచకప్ (World Cup) కు అర్హత సాధించింది. ఐర్లాండ్ (Irland) తో జరిగిన రెండో వన్డే (Second ODI) లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది. కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) బంతితో, బ్యాట్తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆఫ్ఘనిస్థాన్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగే ప్రపంచకప్ టోర్నమెంట్లలో వరుసగా నాలుగోసారి తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 47 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే తొమ్మిదో వికెట్కు గేవిన్ హోయ్ (36), జై మూంద్రా (31) రికార్డు స్థాయిలో 76 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్కు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (71) అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.
అయితే ఐర్లాండ్ యువ లెగ్ స్పిన్నర్ గేవిన్ హోయ్ (4/34) అద్భుతమైన బౌలింగ్తో ఆఫ్ఘనిస్థాన్ను దెబ్బతీశాడు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ రషీద్ ఖాన్ (37 నాటౌట్) ఒత్తిడికి తలొగ్గకుండా నిలబడ్డాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో ఆఫ్ఘన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.