Navi Mumbai : మహారాష్ట్ర, నవీ ముంబైలోని ఒక రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రెస్టారెంట్ భారీగా ధ్వంసమైంది. ఈ ఘటన నవీ ముంబై, సన్పాద సెక్టార్ 1 పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానిక ప్రతీక్ష బిల్డింగ్లో సాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది.
ఈ రెస్టారెంట్లోనే ఒక సమోసా షాప్ కూడా ఉంది. ఇక్కడే గ్యాస్ సిలిండర్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ పేలుడు తీవ్రతకు రెస్టారెంట్ తీవ్రంగా ధ్వంసమైంది. బిల్డింగ్ చాలా వరకు దెబ్బతింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రెస్టారెంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పేలుడు ధాటికి మంటలు చెలరేగకుండా చూశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
नवी मुंबईतील सानपाडा सेक्टर १ मध्ये सकाळी दुकानात भीषण स्फोट. २ जण गंभीर जखमी, वाशी पालिकेच्या रुग्णालयात दाखल. स्फोटाच्या हादऱ्याने समोरील सूरज हॉस्पिटलच्या काचा फुटल्या.#Sanpada #NaviMumbai #Blast pic.twitter.com/CymvEEep1P
— Aaple Nave Shahar (@NaveShahar) September 15, 2026
గాయపడిన ఇద్దరూ మామా, మేనల్లుడిగా అధికారులు గుర్తించారు. మరోవైపు.. పేలుడు తీవ్రత చాలా ధాటిగా ఉంది. రెస్టారెంట్లో పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న షాపులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే, 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక హాస్పిటల్ కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. కిలోమీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.