దోమకొండ : ఉపాధిహామీ పథకంలో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా పండ్ల తోటలు పెంచితే కూలీలకు ఉపాధి, పంచాయతీకి ఆదాయం వస్తుందన్నారు. దోమకొండ మండల కేంద్రంలో మార్కెట్ యార్డు కోసం స్థలం గుర్తించి, రోజువారీ, వీక్లీ మార్కెట్లో రైతులు,వ్యాపారస్తులకు ప్లాట్ ఫామ్లు నిర్మించాలని సూచించారు.
గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దోమకొండ చాముండేశ్వరీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. చాముండేశ్వరి ఆలయకమిటీ చైర్మన్ పాలకుర్తి శేఖర్, ధర్మకర్తలు, ప్రజా ప్రతినిధులు కలెక్టర్కు అమ్మవారి చిత్ర పటాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజలి, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, నాయకులు నర్సయ్య, ఆలయం ధర్మకర్తలు నవీన్, రాజిరెడ్డి, తాసిల్దార్ తదితరులు ఉన్నారు.