Today History : పాకిస్తాన్కు చెందిన కరాచీ నౌకాశ్రయంపై భారత నేవీ ‘ఆపరేషన్ ట్రైడెంట్’ ను 1971 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించింది. వరుస బాంబులతో నౌకాశ్రయాన్ని భారత నౌకాదళ సిబ్బంది వణికించారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజునే రంగంలోకి దిగిన భారత నౌకాదళం తన ప్రతాపాన్ని చూపడంతో వారం రోజుల పాటు కరాచీ నౌకాశ్రయంలో మంటలు కొనసాగాయి. పాకిస్తాన్ వైపు నుంచి దాడులు జరిగే అవకాశాలు ఉంటాయని ముందే ఊహించిన అప్పటి నేవీ చీఫ్ అడ్మిరల్ ఎస్ఎం నందా.. కరాచీ నౌకాశ్రయంపై దాడులకు దిగడం వల్ల ప్రభుత్వానికి ఏదైనా రాజకీయపరమైన అభ్యంతరాలు కలుగుతాయా? అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అడిగారంట. దానికి సమాధానంగా ఇందిరమ్మ.. ‘యుద్ధమంటే యుద్ధమే.. పోరు జరిగినట్లయితే పోరు ఉంటుంది’ అని తన గ్రీన్ సిగ్నల్ను చెప్పకనే చెప్పారంట.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైన మరుసటి రోజున అంటే డిసెంబర్ 4 వ తేదీన భారత నేవీ ‘ఆపరేషన్ ట్రైడెంట్’ ను ప్రారంభించింది. పాకిస్తాన్కు ప్రధాన యుద్ధవనరుగా నిలిచిన కరాచీ పోర్ట్పై వరుస బాంబులతో దాడికి దిగిడంతో ఎక్కడ చూసినా అగ్నికీలలే దర్శనమిచ్చాయి. పాకిస్తాన్ ఇలాంటి పనులకు పాల్పడుతుందని ముందుగానే గ్రహించిన భారత నౌకాదళం.. ఆ మేరకు ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. ఐఎన్ఎస్ నిపట్, ఐఎన్ఎస్ వీర్, ఐఎన్ఎస్ నిర్ఘాట్తో పాటు ఐఎన్ఎస్ కిల్టన్ ముంబైలోని వెస్ట్రన్ ఫ్లీట్ నుంచి రెండో తేదీన కదనరంగంలోకి దూకాయి. కరాచీ నౌకాశ్రయంలో యుద్ధం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న పీఎన్ఎస్ ఖైబర్పై రాత్రి 10.40 వేళ ఐఎన్ఎస్ నిర్ఘాట్ తొలి శతఘ్నితో విరుచుకుపడింది. దాంతో పీఎన్ఎస్ ఖైబర్ నీటిలో మునిగిపోయి దాదాపు 222 మంది చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అనంతరం అక్కడే ఉన్న ఎంవీ వీనస్ ఛాలెంజర్, పీఎన్ఎస్ షాజహాన్పై భారత్కు చెందిన ఐఎన్ఎస్ నిపట్ మిస్సైళ్లతో దాడులకు పాల్పడటంతో అక్కడ మంటలు మిన్నంటుకున్నాయి.
ఆపరేషన్ ట్రైడెంట్ 5 రోజుల పాటు కొనసాగింది. మన వైపు నుంచి ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడం విశేషం. కరాచీ నౌకాశ్రమంలో చెలరేగిన అగ్నికీలలు 60 కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయంటే ఎంత మేరకు విధ్వంసం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కరాచీ పోర్ట్పై చేపట్టిన ఆపరేషన్కు గుర్తుగా యేటా డిసెంబర్ 4 వ తేదీని ‘నేవీ డే’ గా జరుపుకోవడం మొదలుపెట్టారు.
2012: సిరియాలో మోర్టార్ దాడి, 29 మంది దుర్మరణం
2006: ఫిలిప్పీన్స్లోని ఒక గ్రామాన్ని హరికేన్ తాకడంతో దాదాపు వెయ్యి మంది మరణం
1996: ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన మానవ రహిత అంతరిక్ష నౌక మార్స్ పాత్ఫైండర్
1924 : బ్రిటన్ రాజు జార్జ్ V , క్వీన్ మేరీ భారతదేశం పర్యటనకు గుర్తుగా గేట్ వే ఆఫ్ ఇండియా ప్రారంభం
1984: కువైట్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి నలుగురు ప్రయాణికులను చంపిన హిజ్బుల్లా ఉగ్రవాదులు
1977: ఈజిప్టుకు వ్యతిరేకంగా అరబ్ ఫ్రంట్ ఆవిర్భావం
1959: గండక్ ఇరిగేషన్, పవర్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందంపై సంతకాలు చేసిన భారతదేశం-నేపాల్
1860: పారిస్ విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్ పొంది విదేశీ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న మొదటి భారతీయుడుగా నిలిచిన గోవా నివాసి అగస్టినో లారెన్స్
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..