Arsenic in Rice |మనం తినే అన్నం ఆరోగ్యకరమేనా? రోజూ తినే అన్నంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతున్నాయా? వీటికి సమాధానాలు అటుంచితే.. అన్నంతో హానికరమైన రసాయనాలు శరీరంలోకి చేరుతున్నాయనే విషయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. బియ్యంలో ఉండే ఆర్సెనిక్ అనే రసాయం.. మన శరీరానికి హాని కలిగిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది మరింత ప్రమాదకరమని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది. ఇంతకీ ఆర్సెనిక్ అంటే ఏంటి? అది మనిషి ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుంది.. ఆర్సినెక్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఆర్సెనిక్ అనేది సహజ సిద్దమైన మూలకం. ఇది మట్టి, నీళ్లలో లభిస్తుంది. నేలలో 100 mg/kg, నీటిలో 10 μg/L ఆర్సెనిక్ ఉంటుంది. దీన్ని క్రిమిసంహారక మందుల తయారీలోనూ వాడుతుంటారు. పంటలకు పురుగుల మందులు చల్లినప్పుడు ఈ విషరసాయం నేలలోకి చేరుతుంది. ఇలా మట్టిలో ఉన్న ఆర్సెనిక్ శాతం పెరిగిపోతూ వస్తుంది. తద్వారా ఈ ఆర్సెనిక్ పంట ధాన్యాల్లోకి వచ్చి చేరుతుంది.
మట్టి ద్వారా ఆహార ధాన్యాల్లోకి చేరే ఆర్సెనిక్.. స్వల్ప మోతాదులోనే ఉంటుంది. కానీ మిగిలిన ఆహార ధాన్యాలతో పోలిస్తే వరిలో ఈ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. వరిలో సాధారణం కంటే 10 నుంచి 20 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం వరి పంటకు ఎక్కువ నీటిని వినియోగించడమే. పొలాలకు ఎక్కువ నీటిని పెట్టడం వల్ల మట్టిలో ఉన్న ఆర్సెనిక్ చాలా సులభంగా వరి ధాన్యంలోకి చేరుతుంది. ఇదే విషయాన్ని కనుగొనేందుకు నార్తర్న్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్లో క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు కొన్నేండ్ల పాటు పరిశోధనలు చేశారు. మిగతా బియ్యంతో పోలిస్తే బాస్మతి బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి తక్కువగా ఉంటుందని వీరి పరిశోధనలో తేలింది. అదే బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ ఎక్కువ మోతాదులో ఉంటుందని వెల్లడైంది. ఆర్గానిక్ పద్ధతిలో వరి సాగు చేసినప్పటికీ ఆర్సెనిక్ స్థాయిలో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవని తెలిసింది. బియ్యం పై పొరలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలిష్ చేయని ముడి బియ్యం తినవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.
మోతాదు మించి ఆర్సెనిక్ మన శరీరంలోకి చేరితో అనేక సమస్యలు వస్తుంటాయి. వాంతులు, రక్తవిరేచనాలు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలికంగా ఆర్సెనిక్ శరీరంలోకి చేరితే డయాబెటిస్, హృద్రోగాలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆర్సెనిక్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బియ్యంలో ఆర్సెనిక్ ఉండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్వో ), ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ 2014లో గైడ్లైన్స్ జారీ చేసింది. దీని ప్రకారం పాలిష్ చేసిన కిలో బియ్యంలో గరిష్ఠంగా 0.2 మిల్లీ గ్రాముల ఆర్సెనిక్ ఉండొచ్చు.
మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో వరి ప్రధాన ఆహారం. ఇక్కడ ఎక్కువగా అన్నాన్నే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అది కాకుండా పోషకాలు పోతాయని బియ్యాన్ని ఎక్కువగా కడగకుండా, గంజి వార్చకుండా రైస్ కుక్కర్లో వండటం ఇటీవలకాలంలో ఎక్కువైపోయింది. ఇలాంటివి చేయడం వల్ల హానికరమైన ఆర్సెనిక్ను నేరుగా శరీరంలోకి పంపించేస్తున్నాం. అందుకే ఈ ఆర్సెనిక్ విరుగుడుకు నిపుణులు సలహాలు సూచిస్తున్నారు. ఆర్సెనిక్ తగ్గించే అవకాశాలపై క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన ఆండీ మెహార్గ్ తన బృందంతో పలు పరిశోధనలు చేశారు. అందులో రెండు పద్ధతులు ఆయనకు ప్రభావవంతంగా కనిపించాయి. వాటి ప్రకారం.. ఒక గ్లాసు బియ్యాన్ని ఐదు గ్లాసుల నీటిలో ఉడికించి మిగిలిన నీటిని పారబోస్తే దాదాపు 50 ఆర్సెనిక్ పోతుందని తేలింది. అదే బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి, తర్వాత రోజు శుభ్రమైన నీళ్లతో కడిగి వండుకోవడం ద్వారా 80 శాతం ఆర్సెనిక్ తగ్గిపోతుందని కనుగొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?