Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక రంగంలో నిస్తేజం ఆవరించింది. కేసీఆర్ హయాంలో పెట్టుబడులతో కళకళలాడిన రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా అచేతనావస్థకు చేరుకున్నది. కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు జంకుతున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే.. అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పారిశ్రామిక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపట్ల స్పష్టత కొరవడింది. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రతరమైంది. ఇక వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగనుండటంతో మరికొంత కాలం పారిశ్రామిక రంగం పుంజుకునే అవకాశాలు లేవన్న అభిప్రాయాలున్నాయి. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో పలు పెట్టుబడులపై అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనికితోడు నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రవేశపెడుతామని, చిన్నతరహా సంస్థలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు పలు రాయితీలనూ ఇస్తామని సీఎం ప్రకటించినా ఫలితం శూన్యం. ఫార్మాసిటీ అనుమతుల కోసం కేసీఆర్ సర్కార్ కేంద్రానికిచ్చిన ప్రతిపాదననూ నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం బెడిసికొట్టింది. నల్గొండ, వికారాబాద్, మెదక్లలో ఈ-ఫార్మా విలేజ్లను తెస్తామని స్వయంగా సీఎం ప్రకటించినప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. దీంతో ఫార్మా రంగంలో నిస్తేజం ఆవరించింది.
కొత్త ప్రభుత్వంపై పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం కుదరడంలేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. అధికార పార్టీ నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలే దీనికి కారణమని, ప్రభుత్వ మనుగడ ఎలా ఉంటుందనేది పార్లమెంటు ఎన్నికలయ్యాకే తెలుస్తుందని పలువురు చెప్తున్నారు. కాంగ్రెస్ గెలిచే స్థానాలే కీలకమంటున్నారు. హామీల అమలులో విఫలం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లి భూములు కొన్నా.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న విధానాలు, నిరంతర విద్యుత్తు సరఫరాకు ఆకర్షితులై రాష్ర్టానికి తరలివచ్చారు.
అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి విడివిడిగా పారిశ్రామికవేత్తలతో సమావేశమైనా ఫలితం లేకపోయింది. కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్తు, పారిశ్రామిక అనుకూల విధానాలను ప్రవేశపెట్టారు. దీంతో పదేండ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు పారిశ్రామికరంగానికి ఓ కుదుపుగా చెప్పడంలో సందేహంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.