నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ/ అలంపూర్/ ఉండవెల్లి, సెప్టెంబర్ 14: అభివృద్ధి దిశగా అలంపూర్ పయనిస్తున్నదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో మంగళవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై వంద పడకల దవాఖాన, కస్తూర్బా పాఠశాల, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ వంద పడకల దవాఖాన నిర్మాణానికి రూ.21కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉండవెల్లి మండలంలో కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణానికి రూ. కోటీ 25లక్షలు, చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రహరీకి రూ.30.80లక్షలు మంజూరు కావడంతో భూమిపూజ చేశారు.
మంత్రులకు ఘనస్వాగతం
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములుకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే అబ్రహం హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు.
భారీగా తరలొచ్చిన పార్టీ శ్రేణులు
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అలంపూర్చౌరస్తాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రావడంతో అలంపూర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలొచ్చారు. పార్టీ శ్రేణులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అబ్రహం అల్పాహారం ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనాలకు పోలీస్లు ప్రత్యేక పార్కింగ్, వీఐపీ పార్కీంగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ రంజన్ రతన్కుమార్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
దవాఖాన పెంపునకు హామీ
అలంపూర్లోనే వంద పడకల దవాఖాన ఏర్పాటు చేయాలని స్థానికుల కోరికను ఎమ్మెల్యే అబ్రహం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి 50పడకల అలంపూర్ సీహెచ్సీని అన్ని సౌకర్యాలతో త్వరలో వంద పడకల దవాఖానగా పెంచుతామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అబ్రహంకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, విప్ కూచకుళ్ల దామోదర్రెడ్డి, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం తనయుడు ఆజయ్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాష్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్దేవ్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పర్యటన సైడ్లైట్స్
హెలిక్యాప్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఉదయం 9:30నిమిషాలకు అలంపూర్చౌరస్తాకు చేరుకున్నారు.
9:35నిమిషాలకు మంత్రులకు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎమ్మెల్యే అబ్రహం స్వాగతం పలికారు.
9:40కి హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా సభాస్థలికి చేరుకున్నారు.
9:45 భూమిపూజ, హోమం, శిలాఫలకాలను మంత్రులు ప్రారంభించారు.
9:55గంటలకు టీఆర్ఎస్ కార్యకర్తలతో అభివాదం, మాటమంతిలో పాల్గొన్నారు.
10గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అల్పాహారం చేశారు.
10:30నిమిషాలకు టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో మంత్రులు ముచ్చటించారు.
10:50నిమిషాలకు కాన్వాయ్ ద్వారా హెలీప్యాడ్కు చేరుకున్నారు.
11గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా గద్వాలకు వెళ్లారు.