Pothana Bhagavatam Episode 109 | ‘స్తంభ సంభవమద్భుతం’- నారాయణుడు నరసింహునిగా అద్భుతంగా ఆవిర్భవించిన ఆ స్తంభం మనస్సు నిశ్చలస్థితికి సంకేతం. సంకల్ప వికల్పాలు లేని మనస్సుకు చెందిన ఉన్మన్యవస్థ- అమనస్కత (మనస్సును అతిక్రమించిన స్థితి)యే స్తంభం. మనస్సు నశించగా- లయించగా, మిగిలేది ఆత్మయే కాన, మనోనాశమే ‘ఆత్మ స్వరూపస్థితి’. ఆధ్యాత్మిక జీవనంలో ఈ మనోనాశమే ‘మహోదయం’, జీవన సాఫల్యం! ‘సాధకుడు తన హృదయంలోని సంకల్పాలు నిశ్శేషంగా నశించే వరకు మనస్సును నిగ్రహించాలి. సంపూర్ణ మనోనిగ్రహమే జ్ఞానం. అదే మోక్షం. ఇక తక్కిన బోధలన్నీ గ్రంథవిస్తారం మాత్రమే’ అని మైత్రాయణీ ఉపనిషత్ ప్రబోధం. అభవుడు- పుట్టుక లేనివాడు, స్తంభంలో సంభవించాడంటే ఇదే పారమార్థిక గుంభనం- రహస్యం! ‘నిశ్చల తత్తే జీవన్ముక్తిః’ అన్న ఆదిశంకరుల ‘భజగోవింద’ సూక్తి సుప్రసిద్ధమే కదా!
లోకంలో గాలి వీచనప్పుడు కూడా అది ఉంటుంది. లేనిచో ప్రాణహాని కలిగి మనమే ఉండముగా! కానీ, అది (గాలి) దేహానికి తగులదు. అప్పుడు కూడా విసనకర్రలు, వింజామరలు, పంఖాలు వినియోగిస్తే అనిలం- వాయువు, దైహికంగా అనుభవానికి వస్తోంది కదా! అలాగే నిర్గుణ నిరాకారంగా భగవంతుడు అంతటా ఉన్నా, సాధన చెయ్యనిదే సగుణ సాకారంగా సాక్షాత్కరించడు. విశ్వంభరుడు స్తంభంలో ఎలా ఉన్నాడు? సూక్ష్మరూపంలో అవ్యక్తం (అప్రకటం)గా ఉన్నాడు. ‘భక్తార్థం సగుణోజాతో నిరాకారోపి చిన్మయః’ అట్టివాడు ప్రహ్లాదుని అనన్యభక్తికి, అఖండ విస్రంభా (విశ్వాసా)నికి ఆకర్షితుడై స్థూల ఆకృతితో స్తంభంలో వ్యక్తమయ్యాడు. పరమాత్మను, తన సూక్ష్మరూపం వదిలి స్థూలరూపం ధరించునట్లు చెయ్యగల శక్తి భక్తుని పరమప్రేమకు- భక్తికి ఉంది. ప్రస్తరం (రాతి)లో నుంచి కూడా ప్రఖ్యాతిగా పరమాత్మను ప్రభవింపజేసిన భాగవత ప్రవరుడు ప్రహ్లాదుని ప్రేమ పూర్ణభక్తికి పరశ్శతంగా ప్రణామ పారిజాతాలు!
‘కేవల చందన పుష్పాదులతో వందనాదులు గావిస్తూ భజించుట మాత్రమే భక్తి కాదు. అంతటా, అందరిలో ‘వాసుదేవస్సర్వం’ అన్న భగవద్భావం కలిగి ఉండటం వాస్తవ భక్తి’ అన్నారు శ్రీ డోంగ్రే మహారాజ్. నిష్కపటమైన పవిత్ర వ్యవహారమే భక్తి. వ్యవహారశుద్ధి లేనిచో భక్తిలోని ఆనందం అనుభవానికి రాదు. అచ్యుత భగవానుడు అంతటా ఉన్నాడని అందరూ అంటారు. కానీ, దాని అనుభవం మాత్రం బహుకొద్ది మందికే ఉంటుంది. అట్టి మహాపురుషుల జీవితంలో దివ్యత్వం తేజరిల్లుతుంది. వారి దైనందిన వ్యవహారాలలో దురితా (పాపా)
చరణకు, పరితాపానికి తావుండదు.
తే॥ ‘సటలు జళిపించి గర్జించి సంభ్రమించి,
దృష్టిసారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి,
పట్టె నరసింహుఁడా దితిపట్టి నధిప!’
నారద ఉవాచ.. ధర్మనందనా! ‘నా సొంపునుఁ బెంపు నందరును జూడఁ జరింతు, హరింతు శత్రువున్’- ‘అందరూ దర్శిస్తుండగా నా పౌరుష ప్రతాపాలను ప్రదర్శిస్తూ నా ప్రత్యర్థిని- హరిని ప్రహరిస్తా’ అని చింతిస్తూ విబుధవైరి హిరణ్యకశిపుడు, కంజలోచనుడు విష్ణువు పట్ల విరోధం వీడని చిత్తంతో వెనుకంజ వెయ్యకుండా గద ఎత్తి పట్టుకున్నాడు. మృగరాజును (సింహాన్ని) సమీపించే మదగజంలా హుంకరిస్తూ దానవ కుంజరుడు- రాక్షస శ్రేష్ఠుడు, దనుజ భంజనుని- దామోదరుని, ఎదురు నడిచాడు. దావానలం ముందు మిణుగురు పురుగు చందాన, దేవదేవుని దివ్య కాంతిపుంజం (సమూహం) ముందు దానవపతి కళ తప్పి కర్తవ్యం మరచాడు. మహారాజా! సాత్తిక తేజోనిధి అయిన త్రివిక్రముని ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలు కాక ప్రకాశిస్తుందా? అసురరాజు అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు ఉగ్రనరసింహుడు- జటలు ఝళిపించాడు- జూలు విదిలించాడు. తటాలున
హుంకరించాడు. కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా వీక్షించాడు. నాలుకను వికృతంగా ఆడిస్తూ విజృంభించి ఒక్క ఉదుటున దూకి, ఉరగేంద్రుడు- సర్పరాజు ఎలుకను పట్టినట్లు నరకేసరి దానవేంద్రుని ఒడిసిపట్టుకున్నాడు.
మ॥ ‘విహగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా
గ్రహుడై యూరువులందుఁ జేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్’
విహగరాజు- గరుత్మంతుడు అహిని (నాగబామును) గ్రహించి చీల్చునట్లు నరహరి, దానవరాజు సభాభవన సింహద్వారపు దేహళి (గుమ్మం) మీద కూర్చుని, ఆగ్రహంతో వజ్రం వంటి కఠోరదేహుడు, చలించని సమరోత్సాహవంతుడు, మహాబాహుబల సంపన్నుడు, మహేంద్ర, అగ్ని, యమాదులకు కూడా భయంకరుడు, దితికుల శుభంకరుడు, అవక్రవిక్రముడు అయిన హిరణ్యకశిపుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడవేసుకొని వాడిగల తన గోళ్లతో వాడి రొమ్మును చీల్చివేశాడు. వాడి కఠిన నాడీ పుంజాన్ని (రక్తనాళాలను) తుత్తునియలుగా భంజించాడు. నేల మీద వేడి నెత్తురు కురిపించాడు. కడుపులోని ప్రేవులు లాగి ఒడుపుతో కంఠంలో కడు మనోహర మాలికలుగా చేసుకున్నాడు. నరసింహుడు నఖ (గోళ్ల) ప్రభలతో కూడి ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.
కం॥ ‘స్ఫురిత విబుధజనముఖములు,
పరివిదళిత దనుజ నివహపతి తనుముఖముల్
గురు రుచి జిత శిఖిశిఖములు
నరహరి ఖరనఖము లమరు నతజన సఖముల్’
ప్రణుతులతో శరణన్న సాధు పురుషులకు ప్రాణ సఖా (మిత్రు)లైన ఆ నరకేసరి ప్రఖర- తీక్షణమైన, నఖాలు దానవేశ్వరుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపజేశాయి. మితిమీరిన కాంతులతో అగ్నిశిఖలను సైతం అతిక్రమించిన- జయించిన, ఆ శ్రీపతి నఖాలు సమితి-సమర, విజయాన్ని చాటుతూ శోభించాయి.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Pothana Bhagavatam Episode 108 | నరమృగ శరీర నమోస్తుతే
Pothana Bhagavatam Episode 107 | స్తంభంబున జూపఁగలవె? చక్రిన్ గిక్రిన్
Pothana Bhagavatam Episode 106 | ఎందెందు వెదకినఅందందే కలడు..
Pothana Bhagavatam EPisode 105 | వెదకంగా నేల నీ యా యెడన్
Pothana Bhagavatam Episode 104| ..మరి వాఁడెందుండురా? దుర్మతీ!
Pothana Bhagavatam Episode 103 | ఇంద్రజిత్తు కన్నా.. ఇంద్రియజిత్తు మిన్న
“Pothana Bhagavatam Episode 102 | ఇంపు సొంపైన ముగింపు మాటలు”