Supreme Court : భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో అత్తమామలు మౌనంగా ఉన్నంత మాత్రాన వారిపై వరకట్న వేధింపుల కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టంచేసింది. నైతికంగా ఆ ప్రవర్తన తప్పుకావచ్చు కానీ, దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భర్త కుటుంబ సభ్యులందరినీ గుడ్డిగా కేసుల్లోకి లాగడం సరికాదని వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. భర్తకు మద్దతు ఇచ్చారనో, గొడవల్లో జోక్యం చేసుకోలేదనో లేదా సర్దుకుపోవాలని సలహా ఇచ్చారనో అత్తమామలపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేమని కోర్టు తెలిపింది. సర్దుకుపొమ్మని సలహా ఇవ్వడం క్రూరత్వం కాదని స్పష్టంచేసింది.
నేరంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదా నిర్దిష్టమైన పాత్ర ఉంటే తప్ప కేవలం సాధారణ ఆరోపణలతో అత్తమామలను దోషులుగా నిలబెట్టలేమని ధర్మాసనం వివరించింది. మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. సదరు మహిళ తన అత్తమామలపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది. విఫలమైన వివాహ బంధంలో మహిళ పడే వేదనను తక్కువ చేసి చూడలేమని చెబుతూనే ఇలాంటి వైవాహిక వివాదాల కేసులను విచారించేటప్పుడు కింది కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆరోపణలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించింది.
వైవాహిక వివాదాల్లో తీవ్రమైన భావోద్వేగాలు, వ్యక్తిగత కక్షలు దాగి ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమయాల్లో కేవలం భర్తపైనే కాకుండా, గొడవలతో ఎలాంటి సంబంధంలేని అతని కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించే ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. నిందితులుగా చేర్చిన వారు నిజంగానే క్రూరత్వానికి పాల్పడ్డారా..? అదనపు కట్నం కోసం వేధించారా..? అనేదానికి పక్కా ఆధారాలు ఉండటం చట్టప్రకారం ముఖ్యమని కోర్టు స్పష్టంచేసింది.