Rahul Gandhi : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీఛార్జికి, హింసకు కారకుడు అమిత్ షా అని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ చర్య తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ, సీజేపీ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి గురించి స్పందించారు.
‘‘ఢిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. అలాగే, కేంద్ర బలగాలు కూడా హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే పని చేస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో వారంతా కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోనే పని చేస్తారు. ఢిల్లీలో నిరసన చేసిన యువత, విద్యార్థులపై పెల్లెట్ గన్స్, ఎలక్ట్రిక్ బ్యాటన్స్, మేకులున్న లాఠీలు ప్రయోగించారు. పెల్లెట్ గాయాలు, లాఠీ గాయాలున్న విద్యార్థుల్ని చూశాను. విద్యార్థులపై పోలీసులు, భద్రతా బలగాల దాడికి ఆదేశాలిచ్చింది హోం మంత్రి అమిత్ షానే. ఒకవేళ ఈ విషయం అమిత్ షాకు తెలియకుంటే.. ఆయన ఈ పదవిలో కొనసాగడానికి అనర్హుడు. ఒకవేళ ఈ దాడికి అమిత్ షా ఆదేశించి ఉంటే ప్రధాన నిందితుడు కూడా ఆయనే. విద్యార్థులపై జరిగిన ఈ దారుణ ఘటనలకు బాధ్యుడైన అమిత్ షాను మంత్రివర్గం నుంచి తప్పించాలి. ఈ విషయంలో ప్రధాని మోదీకి కూడా నేను సలహా ఇస్తున్నా’’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఈ అంశంపై పార్లమెంట్లో ప్రభుత్వం తనను మాట్లాడనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నేను మాట్లాడేందుకు వీలుగా ఆర్డర్ ఇవ్వాలని లోక్సభ స్పీకర్ను కోరారు. కానీ, అనుమతి ఇవ్వలేదు. అమిత్ షాపై ఆరోపణలు చేసినందుకు నన్ను అనుమతించడం లేదని, క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. క్షమాపణలు చెబితేనే అనుమతిస్తాం అంటున్నారు. నేను బీజేపీకి కానీ, ఆర్ఎస్ఎస్కు కానీ, ఏ ఒక్క వ్యక్తికి కానీ క్షమాపణ చెప్పబోను’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. సీజేపీ నిరసనల సందర్భంగా మైనర్లపై కూడా పోలీసులు దాడి చేశారని రాహుల్ ఆరోపించారు. విద్యార్థులపై అదనపు బలగాల్ని ఉపయోగించడం తీవ్రమైన చర్యగా అభివర్ణించారు.