హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్లాగ్లు మిగిలిన యూజీ, పీజీ పూర్వ విద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. అర్హులైన విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్, సెమినార్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని తమ కోర్సును పూర్తి చేసుకోవచ్చన్నారు.
ఇందుకోసం రిజిస్ట్రార్ అనుమతితో పాటు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. యూజీ, పీజీ విద్యార్థులు ప్రస్తుత బ్యాచ్లతో కలిసి పరీక్షలు రాయవచ్చని, పీజీ విద్యార్థులు అవసరమైతే ఎస్డీఎల్సీఈ పరీక్షలతో పాటు ప్రత్యేక అనుమతి పొంది నిర్ణీత రుసుం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని అర్హులైన పూర్వవిద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం www.kakatiya.ac.in ను సందర్శించవచ్చని తెలిపారు.