Pothana Bhagavatam Episode 105 |భాగవత అష్టమ స్కంధంలో బలి చక్రవర్తి వద్దకు భిక్షుకుడై వెళ్లిన వామన భగవానుడు తన పని చక్కబెట్టుకోవడానికి సమయోచితంగా బలి తండ్రి, తాత, ముత్తాతలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సందర్భంగా వామనుడు బలి ముందు ఒక రహస్యాన్ని బయటపెడతాడు.. దానవేంద్రా! తన తమ్ముడైన హిరణ్యాక్షుని విష్ణువు వరాహ రూపంలో వధించాడని విని వెర్రెత్తిన కోపంతో వీరంగం వేస్తూ మీ ముత్తాత హిరణ్యకశిపుడు శత్రువును సంహరించి పగతీర్చుకోవడానికి వైకుంఠంపైకి దండెత్తాడు. అప్పుడు శూలాయుధం ధరించి ప్రళయకాల యమునివలె వస్తున్న కనక కశిపుని కని మాయగాళ్లకు మాయగాడైన మాధవుడు కాలోచితంగా మనసులో ఇలా ఆలోచించాడు.. ఈ వీరవరుని యుద్ధంతో వారించి- ఎదిరించి జయించే వీలులేదు.
ప్రాణులను మృత్యువు వెంటాడునట్లు నేనెక్కడున్నా నన్ను వీడు వెంబడించక మానడు. ఇలా యోచించి సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు విబుధ వరేణ్యుడు విష్ణువు. ఆ తర్వాత దేవతావైరి- హిరణ్యకశిపుడు వైకుంఠ మందిరంలో దూరి దానవారి శౌరి కోసం భూరి-విరివిగా వెదికాడు. అయినా శ్రీహరి అగుపడలేదు. ఆ ఆగ్రహంతో అసురుడు అబ్జాక్షుని (విష్ణుని) ఆచూకికై ఆకాశాన్ని, అవనిని, అమరావతిని గాలించాడు. పురాలను, భూ వివరాలను (భూ గర్భాలను), వనాలను, వన నిధు(సముద్రా)లను, దిక్కులను పెక్కుమారులు శోధించాడు. లోకంలో ఎక్కడా లోకనాథుని జాడ అగుపడక కడకు వెదకడం కూడా విడిచి ఇలా తలచాడు..
కం॥ ‘పగవాఁడు మడియనోపును
దెగఁడేనియు నెదురువడఁడె? దేహధరులకుం
దెగిన యెడఁ బగర మీఁదను
బగగొనఁదగ దనుచు నుడిగెఁ బ్రాభవ శక్తిన్’
‘నా శత్రువు మరణించి ఉండవచ్చు. లేనిచో ఎదురుపడి నన్ను ఎదుర్కొని ఉండేవాడే. పరలోకగతులైన పగవారి (శత్రువు)పై పగ పూనడం తగదు’ అని తన ఎదలో ఎంచి దండయాత్ర విరమించాడు.
ఒకే గుణం (శబ్దం) కలిగిన జడమైన ఆకాశమే సూక్ష్మమైనప్పుడు.. నిర్గుణ, నిరాకార చైతన్య ఆత్మ ఇంకెంత సూక్ష్మం? కనుకనే బహిర్ముఖులకు తెలియ సాధ్యపడదు. పరమాత్మ బహిర్ముఖులకు, దుష్టులకు, అజ్ఞులకు అల్లంత దూరం. అంతర్ముఖ బుద్ధి కలవారికి, శిష్టులకు, విజ్ఞులకు మరింత దగ్గర- అనగా సాక్షాత్ స్వరూపమే అయి ఉన్నాడు. హిరణ్యకశిపుడు పరమార్థ దృష్టిలేని కేవల పామరుడు. భౌతిక దృష్టి మాత్రమే కలిగిన బహిర్ముఖుడు. కాన, బాహ్య పదార్థాలు మాత్రమే చూడగలడు. కాని, తనకు అత్యంత సమీపంలో- తనలోనే ఉన్నవానిని, అంతర్యామిని, తనను కన్నవానిని కనలేడని తెలిసే హరి హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు. కస్తూరి మృగం కస్తూరి సుగంధం తన నాభినుంచే వస్తుందని తెలియక వనమంతా వెదకి కానక సతమతమవుతూ అలసిసొలసి చివరకు అసువు-ప్రాణాలనే అర్పిస్తుంది.
సప్తమ స్కంధంలో దేవర్షి నారదుడు రాజసూయ యాగ సందర్భంలో సభాముఖంగా రాజర్షి ధర్మరాజుకు ప్రసంగోపాత్తంగా ప్రహ్లాద చరిత్రను ప్రవచిస్తున్నాడు. నారద ఉవాచ… యుధిష్ఠిరా! తనతోనే భేదిస్తూ, భయంకరంగా వాదిస్తూ, తనకే పాఠాలు బోధిస్తూ వేధించుక తింటున్న తనయుని తీరుకు విసిగి వేసారిన అసురరాజు కసితీరగా ‘ఆ హరి ఎక్కడ కలడో ఒకపరి వివరించరా’ అని హుంకరించగా హరి కింకరు (దాసు)డైన ప్రహ్లాదుడు శంకింపక- సందేహించక, అమిత ఆనందంతో దేహం పులకించగా, ఆవంత కూడా ఆగ్రహం లేకుండా, హృదయంలో కరిరాజ వరదుని, మందర గిరిధరుని హరిని స్మరించి, నమస్కరించి బాల వర్తనంబున- బాలుడవడం వలన, నర్తనం- నృత్యం చేస్తూ ఇలా ఆలపించాడు.
మ॥ ‘కలఁడంభోధిఁ గలండు గాలిఁ గలడాకాశంబునం గుంభినిం
గలఁ డగ్నిన్ దిశలం బగళ్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలడోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగ వ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్’
తండ్రీ! విశ్వరూపుడైన విష్ణువు లేని చోటు విశ్వంలో ఉందా? ఆయన సముద్రంలో ఉన్నాడు, సమీరం (గాలి)లో ఉన్నాడు. ఆకాశంలో, అవని (భూమి) మీద, అగ్నిలో, అన్ని దిక్కుల్లో ఉన్నాడు. పగళ్లలో, రాత్రులలో, చండ కిరణునిలో, చంద్రునిలో, అందరి అంతఃకరణాలలో ఉన్నాడు. ఓంకారంలో, శ్రీకారంలో ఉన్నాడు. త్రిమూర్తులలో, త్రిలింగ వ్యక్తులలో- స్త్రీ పుం నపుంసకులలో ఉన్నాడు. ఇక్కడా అక్కడా వెదకటమెందుకు? జనకా! జగన్నాథుడు ఒక చోటనక అంతటా నిండి నిబిడీకృతమై- ఓతప్రోతమై ఉన్నాడు.
పోతన మహాకవి తనే ప్రహ్లాదుడై పై మత్తేభ వృత్తమనే మత్త మాతంగం (ఏనుగు) ఎక్కి విష్ణువు వ్యాపకత్వాన్ని, సర్వ అంతర్యామిత్వాన్ని ‘డాండ డడాండ డాండ’ నినాదాలతో అజాండమంతా మారు మ్రోగించాడు. ‘కలడు, కలడు’ అని పెక్కుమారులు అవ్యక్త మధురంగా పలికి సకల జగత్తు విష్ణు కళామయమని నొక్కి వక్కాణించాడు. ఇది సహజ పాండిత్యుని స్వీయ రచన. ‘ఈశావాస్య మిదం సర్వం’ (ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్మచే పరివ్యాప్తమై ఉంది) అన్న ఈశావాస్య ఉపనిషత్ మంత్రధ్వనికి పురాణం చేసే ప్రతిధ్వని ఇది! ‘అస్తీత్యేవోపలబ్ధవ్యః’- ‘పరమాత్మ ఉన్నాడు అని ఒప్పుకొనే వారి ద్వారా మాత్రమే ఆయన (భగవంతుడు) మెప్పుదలతో పొందబడతాడు. అనగా అంతర్యామి- భగవంతుని అస్తిత్వాన్ని- ఉనికిని అనుభవించేవానికి ఆత్మతత్తం అభివ్యక్తమవుతుంది’ అని కఠోపనిషత్తు ఉద్ఘోష. బ్రహ్మము (పరమాత్మ) లేదు అని వాదించేవాడు సోదిలో కూడా లేకుండా పోతాడని వేదాంత డిండిమం! హిరణ్యకశిపుడు విశ్వమంతా అవిశ్రాంతంగా అన్వేషించినా విష్ణువు గోచరించలేదు. మరి, పరమ భాగవతుడైన ప్రహ్లాదునికి?- ‘ఎందెందు వెదకి చూచిన అందందే గలడు!’
( సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Pothana Bhagavatam Episode 104| ..మరి వాఁడెందుండురా? దుర్మతీ!
Pothana Bhagavatam Episode 103 | ఇంద్రజిత్తు కన్నా.. ఇంద్రియజిత్తు మిన్న
“Pothana Bhagavatam Episode 102 | ఇంపు సొంపైన ముగింపు మాటలు”