Pothana Bhagavatam Episode 103 | నయ విశారదుడు నారదుడు పరమ ఆహ్లాదప్రదమైన ప్రహ్లాద గాథను పాండుతనయుడు యుధిష్ఠిరునికి నిండు సభలో ప్రవచిస్తున్నాడు.. ధర్మనందనా! లీలలందును బొంకులు లేని శీలవంతుడు, లలిత మర్యాదుడైన బాలగురువు కాయాధవుని- ప్రహ్లాదుని, మాయా బాధకమైన బోధలను ఆలకించి పులకించిన అసుర బాలల గురుకులమంతా ఉరుక్రముని- విష్ణుని విశుద్ధ భక్తిలో ఓలలాడుతోంది. గురువులు ఇది గమనించి తమ జరుగుబాటుకే చేటు వాటిల్లబోతోందని గాబరాపడ్డారు. శిష్యుల తిరుగుబాటు గురించి అసుర సమ్రాట్టుకు విన్నవించి, పరిస్థితి చెయ్యిదాటి పొయ్యేట్టు ఉందని, సమర్థతతో చక్కబెట్టుకొమ్మని మొరపెట్టుకున్నారు…
కం॥ ‘చొక్కపు రక్కసి కులమున
వెక్కురు జన్మించినాడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁగంటి? రాక్షసేశ్వర! వెర్రిన్’
‘రాక్షసరాజా! చక్కని రక్కసి కులంలో ఈ దిక్కుమాలిన కొక్కిరాయి పుట్టాడు. నీ కుర్రనికి వైకుంఠుని వెర్రి పట్టింది. మదిలో పదిలంగా పాతుకుపోయిన ఇది- ఈ పిచ్చి, ఇప్పటిలో వదిలేలాగా కనిపించడం లేదు. వీడెక్కడి కొడుకు? ఇలాంటి వెర్రివాణ్ని కన్నావేంటి? ఈ దుడుకువాణ్ని, ఈ దుండగీణ్ని చదివించడం మాకు దుర్లభం’- అని దణ్నం పెట్టి కుండబద్దలుకొట్టారు చండామర్కులు.
ఈ కఠినోక్తులు విన్న కనక కశిపునికి చెవుల్లో కత్తులు గుచ్చినట్లు అనిపించింది. తోక తొక్కిన త్రాచులాగా కోపావేశంతో ఒళ్లు ఊగిపోయింది. చింతనిప్పులవంటి కళ్లతో తుళ్లిపడుతూ పిల్లవాణ్ని రప్పించి పళ్లు కొరుకుతూ, పిడుగులు కురిపిస్తూ, వెరపిస్తూ- బెదిరిస్తూ, విబుధ విరోధి ఇలా విరుచుకుపడ్డాడు- ‘అర్భకా! ఆఖండలా (ఇంద్రా)ది అమరులంతా నా అడుగులకు మడుగులొత్తుతారే! అలాంటిది, ఓరి అజ్ఞుడా! నా ఆజ్ఞ అంటే నీకింత అవజ్ఞా- అనాదరమా? అరే మొండీ! ఎవరి అండ చూసుకొనిరా నీకింత కండకావరం? నీచుడా! ఆచార్యుల మాట ఆలకించక నీతోటి రాక్షస బాలురందరికీ చాటుమాటుగా మోక్షకాంక్ష కలిగించి నీ వాచాలత్వాన్ని- వదరుబోతుతనాన్ని చాటుకొన్నావు. దేవేంద్రాది దిక్కుమాలిన దిక్పాలకులందరూ నన్నే దిక్కుగా తలచి తలలు వంచి మొక్కుతున్నారే! దుర్మతీ! నన్ను ధిక్కరించే నీకు ఎవడురా దిక్కు? ముల్లోకాలలో నేనే మహాబలశాలిని. ఎవడి బలం చూసుకొని బెదురులేక నన్నెదిరిస్తున్నావు? నీకున్న ఆ దిక్కేదో, బలమేదో బయటపెట్టు’ అని పెచ్చరిల్లిన కోపంతో, కచ్చె పూని, రెచ్చిపోయి, గుచ్చి-గుచ్చి అడుగుతాడు అసురరాజు.
తనయుడు వినయంగా కన్నతండ్రితో ఇలా విన్నవించుకున్నాడు..
కం॥ ‘బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు, ప్రాణులకును
బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్రా!’
‘దానవేంద్రా! లోకంలో బలవంతులకు, బలహీనులకు ఎవడు బలమో, నీకు, బ్రహ్మాది దేవతలకు- సకల ప్రాణులకు ఎవడు బలమో, ఆ సర్వవ్యాపకుడైన పరాత్పరుడే నాకూ ప్రబలమైన బలం.’ ‘మహారాజా! దేశకాలాలకు అతీతమైనవాడు, అన్ని దిక్కులకు దిక్కయిన వాడు, దిక్కు కలవారికి లేనివారికి దిక్కయిన- ఆధారమైన వాడెవడో, ఆ అచ్యుతుడే నాకు ఆశ్రయం- పెద్దదిక్కు!’ ‘ఎవడురా నీకు దిక్కు?’ అని ధిక్కరిస్తూ తండ్రివేసిన దిక్కుమాలిన ప్రశ్నకు ఏ దిక్కూ చూడక దృక్కులు (కళ్లు) మూసుకొని, అంతర్యామిని దర్శిస్తూ దరహాసముఖంతో శాంతగుణ ప్రధానుడు, అజ్ఞాన అరణ్య అగ్ని సమానుడు, ప్రజ్ఞాన ఘనుడు అయిన ప్రహ్లాదుడు సమాధానంగా పలికిన పై కందపద్యం పోతనగారి సొంతం.
కం॥ ‘దిక్కులు కాలముతోనే
దిక్కున లేకుండుఁ గలుగు దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాడు నాకు దిక్కు మహాత్మా!’
తనది, తండ్రిది- ఇద్దరిదీ అదే బలమట! ‘హింసా బలమసాధూనాం క్షమా గుణవతాంబలమ్’ (దుర్మార్గులకు హింస బలమైతే, సన్మార్గులకు క్షమ-సహనమే శక్తి) అని అంటాడు విదురుడు. తండ్రిది హింసించే బలమైతే తనది హింసను సహించే బలం. ఉన్నది ఒక్కడే అయితే రెండు బలాలెక్కడివి. బాధించే బలమూ వానిదే, బాధను భరించే బలమూ వానిదే. ఇలా ప్రహ్లాదునివలె రెంటినీ ఒకటిగా చూస్తే అది నిండైన బలం- ప్రాబల్యం! దైత్యరాజు వలె రెండుగా భావిస్తే అదే మెండైన మొండి దౌర్బల్యం! అనాత్మ బలం అసలు బలమే కాదు. అది ఆభాస బలం. జలంలో ప్రతిబింబించే ఫలం లాంటిది. అది కంటికి కనిపించేదే కాని పంటికిందకు వచ్చేదికాదు. ఆత్మ-పరమాత్మ బలమే బలం. అది బింబరూపం. ‘బలం బలవతాం చాహమ్’- ‘బలవంతులలోని బలం నేనే’ అని గీతలో పరమాత్మ వచనం. యముడంటే అందరికీ భయం. కాని, భక్తుడు భయానికే భయం. మార్కండేయుడు యమునికే భయం కలిగించాడు. శవాన్ని కౌగిలించుకొన్న వానికి భయం కాని, శివాన్ని కౌగిలించుకొన్నవానికి యమ భయం ఎక్కడిది? ‘ద్వితీయాద్వై భయం భవతి’ ద్వైతమే-రెండవది ఉంటేనే భయం! అంతా తానే అయితే ఇక చింత దేనివల్ల?
ఉ॥‘లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ, వింద్రియా
నీకముఁ జిత్తమున్ గెలువ నేరవు, నిన్ను నిబద్ధుఁజేయు నీ
భీకర శత్రులార్వురఁ బ్రభిన్నులఁ జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లేడొకడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!’
తండ్రిది హింసించే బలమైతే తనది హింసను సహించే బలం. ఉన్నది ఒక్కడే అయితే రెండు బలాలెక్కడివి. బాధించే బలమూ వానిదే, బాధను భరించే బలమూ వానిదే
తనయుడు తండ్రికి ఇదే అదనుగా తగు విధంగాపదునుగా ఇలా తలంటాడు.. ‘రాక్షసరాజా! లోకాలన్నీ ఒక్క గడియలోన జయించావు. కాని, నీలో ఉన్న ఇంద్రియానీకాన్ని- జ్ఞానేంద్రియాలను, మనస్సును గెలువలేక పోయావు. మనః పరిపాకం కలిగించని లోకజయం కేవలం ఊకదంపుడు కాదా? నిన్ను నీ దేహంలో బంధించి ఉంచిన కామ, క్రోధాది ఆరుగురు భీకర శత్రువులను నిర్మూలిస్తే విశ్వంలో నీకు విరోధి అనేవాడే ఉండడు. ‘వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక’- ధర్మమార్గం నుంచి మరలిన మనస్సును మించి మరి వైరి ఎవరు? (‘చిత్తవృత్తి నిరోధమే యోగం’ కనుక విరోధించి కాక మనస్సును నిరోధించి వశపరచుకోవాలి. మనోజయమే జగద్విజయం! సనాతన ధర్మంలో ఇంద్రజిత్తును మించిన మహిమ కలవాడు ఇంద్రియజిత్తు! ఇంద్రుని గెలిచిన ఇంద్రజిత్తుని- రావణ పుత్రుడు మేఘనాదని సంహరించిన లక్ష్మణుడు ఇంద్రియజిత్తు- మహాత్ముడు.) తండ్రీ! వివేకంతో విషయాన్ని విమర్శించి నా విన్నపాన్ని మన్నించు. మంచి మనసుతో మరోమారు ఆలోచించి నిన్ను సంసారంలో ముంచివేసే కర్మబంధాలను త్రెంచివేయి. చిత్తంలో సర్వజీవుల పట్ల సమత్వం- సమభావం, సాధించడమే సర్వేశ్వరుని సర్వోత్తమ సమర్హణం-సేవ. చక్కని సమదృష్టిని పాదుకొల్పి సంసారాన్ని భగ్నం చెయ్యి. మనస్సును మాధవ భక్తిలో మగ్నం కావించు. అదే సుదినం, సులగ్నం! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
“Pothana Bhagavatam Episode 102 | ఇంపు సొంపైన ముగింపు మాటలు”