Pothana Bhagavatam Episode 100 | నారద ఉవాచ- ధర్మ నందనా! దైవ దర్శనం చేయించే దక్షత గల దివ్యదృష్టి సంపన్నుడైన దేవర్షి నారదుని ద్వారా భాగవత ధర్మంగా భాసిస్తున్న ఈ భవ్య జ్ఞానాన్ని నేను పొందానని ప్రహ్లాదుడు పలుకగానే, అసుర బాలకులు ఆశ్చర్యపడి ఇలా అడిగారు.. ‘మిత్రమా! పుట్టినప్పటి నుంచీ ఒకేజట్టుగా కలసి చదువుకున్న మనకు చండామర్కులు తప్ప మరో గురువు ఉన్నట్టు తెలియదు కదా! గిట్టనివాడు (శత్రువు) ముక్కంటి వంటివాడైనా ఎట్టి పరిస్థితిలోనూ పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించకుండా దైత్యపతి (కనక కశిపుడు) కట్టుదిట్టం చేశాడు కదా! మరి నీకు ఏ సద్గురువు గుట్టుగా ఈ విద్యను బోధించాడు? ప్రహ్లాదా! ఈ దైత్యవంశంలో నువ్వు తప్ప పుట్టావు. నీకింత గొప్ప బుద్ధి ఎలా అబ్బిందో మాకు చాలా అబ్బురంగా ఉంది. తెలుసుకోవాలని కడుపు ఉబ్బరంగా ఉంది, చెప్పు.’
ప్రహ్లాదుడు నవ్వుతూ ఇలా పలికాడు.. (‘పలికించెడి వాడు రామభద్రుండట!’ అని మనస్ఫూర్తిగా నమ్మిన మన బమ్మెర పోతన ఈ ప్రసంగంతో ఆ పుష్కరాక్షు(రాము)ని దయతో ఆలంకారిక శైలిలో దుష్కరమైన ప్రాసతో నాలుగు వృత్తాలు అనాయాసంగా- అలవోకగా ఆవిష్కరించి అధ్యేత (చదువరు)లను అలరించాడు)
శా॥ ‘అక్షీణోగ్ర తపంబు మందరముపై నర్థించి మా తండ్రి శు
ద్ధ క్షాంతిం జని యుండఁ జీమగమిచేతన్ భోగిచందంబునన్
భక్షింపంబడెఁ బూర్వ పాపములచేఁ బాపాత్మకుం డంచు మున్
రక్షస్సంఘము మీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై’
మిత్రులారా! పూర్వం మా తండ్రి ప్రశాంత మనసుతో అపూర్వంగా ఉగ్రతపస్సుకై సుందరమైన మందర పర్వతం మీదికి వెళ్లాడు. చలిచీమల చేతచిక్కి చనిపోయే బలవంతమైన భోగి (పాము)వలె ఈ పాపాత్ముడు తన పాతకా(పాపా)ల చేతనే భక్షింపబడి ఉంటాడని బృందారకు(దేవత)లు భావించారు. అదే అదనుగా అసురులను అంతమొందించాలని అమరులు దురంతమైన ఆహవాని (యుద్ధాని)కి ఆయత్తమయ్యారు…
శా॥ ‘ప్రస్థానోచిత భేరి భాంకృతులతోఁ బాకారియుం దారు శౌ
ర్య ైస్థెర్యంబుల నేగుదెంచినఁ దదీయాటోప విభ్రాంతులై
స్వస్థేమల్ దిగనాడి పుత్రధనయోషామిత్ర సంపత్కళా
ప్రస్థానంబులు డించి పారి రసురుల్ ప్రాణావనోద్యుక్తులై’
జైత్రయాత్రకు తగినట్టుగా యుద్ధభేరీలు మోగాయి. జంభాసురవైరి (ఇంద్రుడు), దేవతలు పెద్దసైన్యంతో విజృంభించి ఆవేశ ఆటోపాలతో వచ్చి పట్టణాన్ని ముట్టడించారు. అసురరాజ మందిరం ఆక్రమించి ఎల్ల సంపదలు కొల్లగొట్టారు. ఆ ధాటికి తట్టుకోలేక దైత్యకోటి తమ దారా(భార్యా) పుత్రులను, ధనధాన్యాలను, బంధుమిత్రులను విడిచిపెట్టి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. సంక్రందనుడు-ఇంద్రుడు, సంకోచం లేకుండా సాధ్వీమతల్లి అయిన మా తల్లిని చెరపట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడుతూ ఎంత విలపించినా వినిపించుకోలేదు. దైవయోగంచే దారిలో జడదారి నారదుడు పాకారి (ఇంద్రుని) ముందు ప్రత్యక్షమయ్యాడు. అసురరాజ సతిని- లీలావతిని అతి హర్షం, అమర్షం( కోపం)తో అమరాధిపతి తీసుకుపోతుంటే దేవర్షి చూచి ‘ఓ దివస్పతీ- ఇంద్రా! నీవు దేవతలలో ఉత్తముడవు, పుణ్యమూర్తివి, నీతిమంతుడవు. అతిదీనంగా విలపిస్తున్న ఈ నాతిని, పరసతిని, అందునా గర్భవతిని చెరపట్టడం పాడికాదు. భీతితో వణుకుతున్న ఈ మానవతిని ఓ శచీపతీ! వెంటనే విడిచిపెట్టు. పాకశాసనా! ఈ పడతి పుణ్యాత్మురాలు. నీ కోపాన్ని దుర్జయుడైన దేవవిరోధి కనక కశిపుపై కుమ్మరించు, ఈ ముద్దుగుమ్మపై కాదు’ అంటూ వారించాడు. వేల్పుతపసి (నారదుని)కి వేయి కన్నుల దొర- సహస్రాక్షుడు ఇంద్రుడు ఇలా విన్నవించాడు.. ‘మహాత్మా! ఈమె గర్భంలో సురవిరోధి హిరణ్యకశిపుని వీర్యం వృద్ధి చెందుతూ ఉంది. అది మా వినాశనానికి మూలకారణం. కాన, కానుపు అయ్యేవరకు ఈమెను కారాగృహంలో బంధించి, పుట్టిన బిడ్డను వెంటనే వజ్రాయుధంతో వధించి, పిమ్మట ఈమెను నిశ్చింతగా విడిచిపెడతా.’ ఇది విని దేవేంద్రునితో మునీంద్రుడు ఇలా అన్నాడు…
శా॥‘నిర్భీకుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా
విర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్టుండు దైత్యాంగనా
గర్భస్థుండగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్
దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దర్ప విభ్రాంతుడై’
దేవరాజా! ఈ దానవ సాధ్వి గర్భమందున్న అర్భకుడు (బిడ్డడు) పరమ భాగవతుడు, పాప రహితుడు, నిర్భయుడు, అజాత శత్రువు. అనేక జన్మపరంపరా ప్రాప్తమైన పురుషోత్తముని ప్రశస్త పదభక్తి మహిమా సంపన్నుడు. కాన, అమరేంద్రా! నీవు ఎన్ని సమరాలు (యుద్ధాలు) సాగించినా, ఎన్ని మారణోపాయాలు పన్నినా ఈ చిన్నిపాపడు నీచేత చిక్కి చావడు. నీ అమోఘ బలం ఈ బాలునిపట్ల మోఘమే- వ్యర్థమే అవుతుంది.’
మునీంద్రుని మాటలు మన్నించి మఘవ-ఇంద్రుడు, తాను కూడా మాధవ భక్తుడే కాన మా అమ్మకు ప్రణమిల్లి ప్రదక్షిణం చేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. మా తల్లిని తనయ- కూతురుగా భావించి దేవర్షి, మా తండ్రి వచ్చేదాకా ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చాడు. మహాపతివ్రత అయిన మాతాశ్రీ భర్తనే దేవుడిగా భావిస్తూ మహర్షికి సౌశీల్యంతో సేవలు చేస్తూ ఉండేది. ఆశ్రితరక్షా విశారదుడైన నారదుడు గర్భంలో ఉన్న నన్ను ఉద్దేశించి భాగవత ధర్మాన్నీ, నిర్మల జ్ఞానాన్నీ ఉపదేశించాడు. దేవర్షి దయవల్ల అది మరుగున పడకుండా నా మదిలో పదిలంగా ఒదిగిపోయింది. మిత్రులారా! నా మాటలు విని నమ్మితే మీకు మేలు కలుగుతుంది. దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోగా త్రివిక్రముని యందు తీవ్రమైన భక్తి ఏర్పడుతుంది.’
శిశువు గర్భావస్థలో ఉండగానే జ్ఞాన సంస్కారాలను ప్రదానం చేసే ఈ ప్రకృష్టమైన విధానం ప్రాచీన భారతీయ మహర్షుల మేధో జనితం! ఇట్టి జన్మాంతర స్మృతి ప్రహ్లాదునికి ఉన్నదంటే అతడెట్టి జగజెట్టి భాగవతుడో చెప్పనక్కరలేదు. ఎన్నో జన్మల సాధన ఫలంగా చరమ జన్మలో- ‘వాసుదేవస్సర్వమితి’- ‘ఇదంతా వాసుదేవుడే’ అన్న సర్వాత్మ భావం, అఖండ జ్ఞానం కల్గుతుంది. వశిష్ఠ వామదేవాది మహాజ్ఞానుల కోవకు చెందిన మహాత్ముడు ఈ ప్రహ్లాదుడు! జన్మతః సిద్ధుడు!!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006