Pothana Bhagavatam Episode 99 | ధర్మ మర్మ విదుడైన దేవర్షి నారదుడు రాజసూయ యాగ సమయంలో ధర్మనందనుడు రాజర్షి యుధిష్ఠిరుడికి అసురర్షి ప్రహ్లాదుడి అద్భుత చరిత్రను వీనుల విందుగా వివరిస్తున్నాడు..
మహారాజా! బాల ప్రహ్లాదుడు దైత్యబాలురను చాలా ప్రేమతో హరిభక్తిలో ఇలా ఓలలాడించాడు.. మిత్రులారా! ‘శతమానం భవతి శతాయుః పురుషః’- శత సంవత్సరాలకు పరిమితమై, భద్రమై, హితకరమైన నర జీవితంలో సగభాగం క్షుద్రమైన అతినిద్రకే నివేదితమవుతున్నది. మిగిలిన సగంలో సగం పసితనంలోను, వసివాడిన మసిబారిన ముసలితనంలో పసలేకుండా పోతుంది. మిగిలిన స్వల్పకాలం (పాతికేళ్లు) అల్పమైన విషయ సుఖాలతోను, కల్పించుకున్న జీవనోపాధి, వ్యాధి, వియోగాది సంబంధమైన దుఃఖాలతోను ఆవిరైపోతుంది. మానవుడు కామక్రోధాది పాశాలకు బద్ధుడై ఆమరణం- మరణ పర్యంతం, ముక్తికై రణం సాగిస్తూనే విరమణం పొందుతాడు. కుటుంబం అనుబంధాలే బంధాలై గృహపతి (యజమాని)ని అంధకూపంలో కట్టిపడేస్తాయి. ఒక చిన్న పురుగు, సాలీడు పన్నిన వలలో చిక్కి బయటపడలేక విలవిల తన్నుకునే విధంగా, మహా విద్వాంసుడు కూడా గుహ్యేంద్రియ (మైథున), జిహ్వేంద్రియ (భోజన) సుఖాలే మిన్నగా ఎంచి, వానిలో సక్తుడై, ప్రమత్తుడై విరక్తి చెందక ముక్తి మార్గాన్ని మరచిపోతాడు.
గృహ బంధనాలు బహువిధాలు. ధన, కనక, వస్తు వాహనాలు, ఆరామ క్షేత్రాలు, పుత్ర, మిత్ర, కళత్ర, బంధువులు- ఇవి అంత తేలికగా తెగేవా?- త్రివిక్రమ భగవానుడి తగని అనుగ్రహం లేకపోతే! కనుక, బాలకులారా! మరణం కబళించక ముందే కరణ కళేబరాల (దేహేంద్రియాల)తో భగవచ్చరణ శరణాగతే ఈ జన్మకు వరణ యోగ్యం- వరింపదగింది. సకల ప్రాణులకు స్వామి, సుహృత్తు (ప్రత్యుపకారం ఆశించక అకారణంగా అనుగ్రహించువాడు), ప్రియతముడు, ఆత్మ ఆ భగవంతుడే! మధుసూదనుని- కృష్ణుని, కృప లేనిదే ప్రాణాలకంటే మధురమైన తృష్ణ (దురాశ) తొలగదు. స్నేహితులారా! ఇష్టం లేకపోయినా, కష్టపడక పోయినా దుఃఖం వచ్చిపడునట్లే, సర్వ జీవులకు ఇంద్రియ సుఖం కూడా ప్రారబ్ధ ఫలంగా ఏ పుట్టుకలోనైనా అప్రయత్నంగా లభిస్తుంది.
సుఖదుఃఖాలు రెండూ పుణ్యపాప కర్మల ఫలాలు. ఎట్టివారికైనా అనుభవించక తప్పనివి. అందుకే, ఇచ్చగించే (కోరే) సుఖం కొరకు అతిగా ప్రయాస- శ్రమ పడటం ఆయుస్సును వ్యర్థంగా వెచ్చించటమే. ఈ దేహం సదా సందేహాస్పదమే. కాన, చతురుడైన మానవుడు చావక ముందే మనస్సు చిక్కబెట్టుకొని స్వకార్యం చక్కబెట్టుకోవాలి. ఆత్మబంధువులారా! ముకుంద చరణారవిందాల పొందు (ప్రాప్తి) వలన కలిగే క్షేమం ఏ భౌతిక సుఖమందూ లేదు.
సీ॥ ‘కంటిరే మనవారు ఘనులు
గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము?
భద్రార్థులై యుండి పాయరు,
సంసార పద్ధతి నూరక పట్టువడిరి,
కల యోనులం దెల్ల గర్భాద్యవస్థలఁ
బురుషుండు దేహియై పుట్టుచుండుఁ
దన్నెరుఁగడు, కర్మతంత్రుఁడై
కడపట ముట్టఁడు భవ శతములకు నయిన’
ఆ॥ ‘దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు
జగతిఁ బుట్టిపుట్టి చచ్చి చచ్చి
పొరల నేల మనకుఁ? బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డ బుద్ధి’
మిత్రులారా! మనవారు ఘనులు- గొప్పవారు, గృహస్థులుగా, వనస్థులుగా ఉంటూ వైఫల్యం పొందికూడా విర్రవీగుతున్న వారి వెర్రితనం మీరు వీక్షిస్తున్నారు కదా! ఒకవైపు భద్రత (మేలు)ను వేడుకుంటూ కూడా అభద్రమైన- కీడు కలిగించే పాడు సంసారాన్ని వీడజాలక వెతల (బాధల) పాలవుతున్నారు. పలు విధాల మాతృ గర్భాల నుంచి పుడుతూ, నానా అవస్థలు పడుతూ కూడా మాయా గర్భం నుంచి ముక్తి పొందలేక పొందుతున్నారు. తమను తాము తెలుసుకోలేకపోతున్నారు. వందల వందల జన్మలెత్తినా కర్మబంధాల కబంధ హస్తాల నుంచి బయట పడలేకపోతున్నారు. సంసారం వల్ల శ్రేయస్సూ లేదు, దివ్యమైన యశస్సూ లేదు. ఈ లోకంలో పుట్టడం, చావటం, మరల పుట్టడం, చావటం- ఇలా పొర్లుతూ ఉండే ఈ పీడ మనకేల? చూడగ, అసలు చావుపుట్టుక అనేదే లేని జాడ- దారి వెతుక్కోవడం ఎంతో మంచిది కదా!
మిత్రులారా! మీరందరూ విషయాసక్తులైన దైత్యుల, గురువుల సాంగత్యం వదలండి- ముక్తిని కోరువారై ఆదిదేవుడైన అచ్యుతుని ఆశ్రయించండి. ‘పరమాత్మ ప్రసన్నుడు కావడానికి ఎంతో ప్రయాసపడాలి, అది మనకు సాధ్యమా?’ అని సందేహపడతారేమో! చెప్తాను వినండి.. ‘సర్వభూతాలకు- ప్రాణులకు ఆత్మ స్వరూపుడు కనుక భగవంతుడు భక్త సులభుడు. తాను సాధ్యుడు కాడు, సిద్ధ వస్తువు! ఆత్మ సర్వులకు అన్నిటికంటె ప్రియమైనది. ఆత్మపట్ల ప్రేమ స్వతఃసిద్ధం- సహజమైనది. అనాత్మ (జడ) వస్తువులు కూడా ఆత్మ సంబంధం వల్లనే అందరికి ప్రేమపాత్రమవుతున్నాయి. ఆ పరమాత్మే అంతర్యామి రూపంగా ద్రష్ట- సాక్షిగాను, జగద్రూపంగా దృశ్యంగా కూడా ఉన్నాడు. వాస్తవానికి దృశ్యం కూడా అతనికంటే వేరుకాదు. ఆయన అనుభవం చేత మాత్రమే అవగతమయ్యే- తెలియబడే ఆనంద స్వరూపుడు, అపరిణామి- ఎప్పటికీ మార్పు చెందనివాడు, అనిర్వచనీయుడు- ఇట్టిది అట్టిది అని నిరూపింపదగిన రూపం లేనివాడు. దైత్య బాలకులారా! మీరు దానవ స్వభావం వదలి సర్వప్రాణుల పట్ల దయ చూపండి. అలా అయితేనే అచ్యుతుడు మెచ్చుకుంటాడు. ఆయన ప్రసున్నుడైతే మనకు లభించనిదంటూ ఉండదు. మాధవసేవ అలవడితే మోక్షంతో కూడా పనిలేదు. పురుషోత్తముని కృప కలిగితే పురుషుని- మానవుని పశుబుద్ధి నశిస్తుంది. పవిత్రమైన ఈ జ్ఞానాన్ని పూర్వం నారాయణ మహర్షి నారదుడికి బోధించాడు. అనుభవ పూర్వకమైన ఈ జ్ఞానమే విశుద్ధ భాగవత ధర్మం. నేను ఈ ధర్మాన్ని మొదటగా నారద మహర్షి ముఖతః విన్నాను.’. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006