Pothana Bhagavatam Episode 104 | ధర్మమార్గం నుంచి మరలినవాడు మహాపండితుడైనా మూర్ఖుడే. ధనవంతుడైనా నిర్ధనుడే. బలవంతుడైనా దుర్బలుడే. అలాంటి బలహీనుడైన బలవంతుడు హిరణ్యకశిపుడు! ‘పాలింపుము శేముషి’ (బుద్ధి కుశలతతో ఆలోచించు, పాండిత్యాన్ని పాటించు), ‘కీలింపుము హృదయమందుఁగేశవ భక్తిన్’ (రాగద్వేషాలు వదలి విష్ణువును వేడుకో) అంటూ తనయుడు, ఆడిన మాటలు తండ్రికి గుండెలో ఈట్లై గుచ్చుకున్నాయి. భగభగమండే అతని క్రోధాగ్నిలో అవి ఆజ్యం పోశాయి. ఈ సందర్భంలో పోతన మహాకవి మూలకథకు మరింత మెరుగులు అద్దుతూ అందంగా అమూలకాలైన రెండు శార్దూల వృత్తాలు, రెండు మత్తేభ వృత్తాలు, మరిరెండు కందపద్యాలు వీనుల విందుగా పొందుపరచాడు.
హిరణ్యకశిపుడు అహంకారంతో ఇలా హుంకరించాడు..
శా॥ ‘నాతోడం బ్రతిభాష లాడెడు జగన్నాథుండు నా కంటె నీ
భూతశ్రేణికి రాజు లేఁ డొకఁడు సంపూర్ణ ప్రభావుండు, మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం బల్మారు నారాయణుం
డేతద్విశ్వములోన లేఁడు, మరి వాఁడెందుండురా? దుర్మతీ!’
‘ఓరీ కుమతీ! చావుకు తెగించావు. చిన్న-పెద్ద చూడకుండా హద్దుమీరి వదరుతున్నావు. బెదురు లేకుండా ఎదురు తిరిగి నాతోనే వాదనకు పూనుకున్నావు. నా హృదయ వేదన నీకు పట్టడం లేదు. నాకే బోధనకు బరితెగించావు. ఇంతగా ముదిరిపోయిన నీకు ఇక ముద్దు మురిపాలు లేవు. ఓరి మొద్దూ! ఈ జగతికి నేనే ఏకైక పతిని. అఖిల జీవకోటికీ నేనుకాక అజరుడు, అమరుడు, అప్రమేయ ప్రభావుడు అయిన మరో అధిపతి లేడు. నా ప్రియ సహోదరుడు హిరణ్యాక్షుని వరాహ రూపంలో వచ్చి హతమార్చిన హరి కోసం నేను అలుపెరగక పలుమారులు ఇలలో వాడవాడలా అణువణువూ అన్వేషించా. అయినా వాడి జాడ తెలియలా. ఆ విష్ణువు ఈ విశ్వంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు?’
కం॥‘ఎక్కడఁ గలఁ?డే క్రియ నే
చక్కటి వర్తించు? నెట్టి జూడన్ వచ్చున్?
జక్కడుతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్’
‘అర్భకా! ఆ విష్ణువు ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? ఏవిధంగా సంచరిస్తుంటాడు? ఏ పద్ధతిలో రాకపోకలు సాగిస్తాడు? ఆ రహస్యం బయటపెట్టు. వాడిదాసుడి లాగా- నమ్మిన బంటుగా తెగపొగడుతున్నావు. కూలికి కుదురుకొన్నట్టుగా ప్రేలుతున్నావు. నేనడిగిన దానికి సమాధానం చెప్పు. లేకపోతే నిన్ను, నీ హరిని కూడా సంహరిస్తా’. వాస్తవానికి పరమార్థంలో ఆ తత్త రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలనే హిరణ్యకశిపుని తపన, తాపత్రయం!
పై శార్దూల వృత్తం ప్రహ్లాద చరిత్రకే సారభూతమైన పరమార్థంగా ప్రకాశిస్తోంది. మాయకు ఆవరణమని, విక్షేపమని రెండు శక్తులు. ఈశ్వరుని, జ్ఞానిని విడిచి (తప్ప) ఆవరణ శక్తి దేహానికి, ఆత్మకు కల భేదం తెలియరాకుండా ప్రపంచాన్నంతా అంధకారంలాగా ఆవరిస్తుంది. ఈ ఆవరణశక్తి అసత్త్వావరణమని, అభానావరణమని రెండు విధాలు. ‘నారాయణుండేతద్విశ్వములోన లేడు’- అన్నాడు హిరణ్యకశిపుడు. వస్తువు (దేవుడు) లేదు అని వ్యవహరించడానికి కారణమైనది ‘అసత్త ఆవరణం’. ‘మరి వాడెందుండురా?’ అని ప్రశ్నించాడు రాక్షసరాజు. ఇలా వస్తువు ఉన్నా తెలియడం లేదు అని వ్యవహరించడానికి కారణమైనది అభాన ఆవరణం. ఈ ద్విముఖమైన ఆవరణశక్తి కార్యమే సంసారవృక్షానికి మూలం. ఈ రెండు ఆవరణలు తత్తజ్ఞానం కలిగితే భంగమై (తొలగి)పోతాయి.
తత్తజ్ఞానం కూడా పరోక్షమని, అపరోక్షమని రెండు విధాలు. సద్గురువు వద్ద శ్రద్ధగా వేదాంత శ్రవణం వలన కలిగే జ్ఞానం ‘పరోక్షం’. దీనికే ‘శ్రవణం’ అని కూడా పేరు. ఈ శ్రవణం వలన ‘దేవుడు లేడు’ అన్న అసత్త ఆవరణం తొలగడమే కాక, ‘దేవుడు ఉన్నాడు’ అని కూడా తెలుస్తుంది. అయితే, పరోక్ష జ్ఞానం ఉన్నవారు పండితులే కాని ప్రబుద్ధులు- జ్ఞానులు కారని వేదాంత శాస్త్ర నిర్ణయం. చీకటిలో దీపనామం స్మరించడం వలన దారి కనిపించదు కదా! అలాగే పరోక్ష జ్ఞానం వల్ల ‘ఆత్మప్రాప్తి’ కలుగదు. శ్రవణం చేసిన ప్రతి విషయాన్ని నిరంతరంగా ‘మననం’- విచారణ (చింతన) చేయడం వల్ల ‘అహం బ్రహ్మాస్మి’ (నేను బ్రహ్మనై ఉన్నాను) అనే అనుభవం (తోచుబడి) కలుగుతుంది. ఇదే అపరోక్ష జ్ఞానం. దీని వలన బ్రహ్మానందం అనుభవానికి వస్తుంది.
ఈ ప్రసంగాన్ని పురస్కరించుకొని కంచి పరమాచార్యులు అద్వైతాన్ని ఎంతో సులభంగా, సరసంగా స్పష్టం చేశారు. ‘జగన్నాథుండు నా కంటె నీ భూతశ్రేణికి రాజు లేడొకడు’ అని హుంకరించాడు హిరణ్యకశిపుడు. శంకర భగవత్పాదులు ‘జీవో బ్రహ్మైవ నాపరః’ జీవుడు-బ్రహ్మ ఒక్కరే అని ఘోషించారు. అనగా ‘స్వామి’ అంటే వేరే ఎవరో కాదు మనమే అని అర్థం. ‘నేనే స్వామి (ప్రభువు)ని, నేను కాక వేరే స్వామి-వీరాస్వామి ఎవడూ లేడు’ అని హిరణ్యకశిపుడూ హెచ్చరించాడు. కాని, విష్ణువు నృసింహుడై అవతరించి వానిని సంహరించాడు. ఇప్పుడు శంకరులు చెప్పిందీ, హిరణ్యకశిపుడు అన్నదీ ఒకటేనా? అని ఆలోచించాలి. నేను తప్ప వేరే నాథుడు (దేవుడు) లేడు- అని అసురరాజు అనడం అహంకారంతో కూడిన వాగాడంబరం. బ్రహ్మ (స్వామి) తప్పించి వేరే వస్తువే లేనందున మనమూ స్వాములమే- బ్రహ్మలమే- అని శంకరులు అన్నమాట ఎంతో వినయంతో కూడింది.
జీవుడు అహంకారాన్ని సమూలంగా వదిలేస్తే బ్రహ్మలో లీనమై బ్రహ్మమై పోతాడని వేదాంత- అద్వైత దర్శనం. మనం- మనలో ఏ ఒకరైనా స్వామి కాకపోతే పరమాత్మ కంటె భిన్నమైన వస్తువు విడిగా ఒకటి ఉన్నదనేగా అర్థం! ‘ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ (పరమాత్మ ఒకడే, రెండవది లేదు) అనికాక ఆయనతో ప్రమేయం- నిమిత్తం లేకుండా అనేకులు ఉన్నట్లు, వారిలో తానూ ఒకడు అన్న అర్థం దాపురిస్తుంది. అప్పుడు ఆయనను ప్రభువని, పరమాత్మ అని, ఈశ్వరుడని ఎలా అనగలం? ‘సర్వము తానయైనవాడెవ్వడు?’- అంతా తానే అయినవాడు కదా ఆత్మేశ్వరుడు (పరబ్రహ్మ) అంటే! అంతా ఆయనే అయితే మనకు ప్రత్యేకమైన ఉనికి ఎలా ఉంటుంది? అందుచేత, అద్వైత బుద్ధి- భావం వలన పరమాత్మ మహిమకు ఏ లోటూ, ఏ చేటూ వాటిల్లదు. అలాకాక, జీవుడు అల్పుడు, దేవుడు అమితుడు- అనంతుడు. కాన, ‘జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు’ అని వినయ విధేయతలతో చెప్పేవారి వాదం వారికి తెలియకుండానే ‘స్వామి’ మహిమను, ఉత్కర్షను తగ్గిస్తోంది. ‘స్వామియే సకలం’ (సర్వం ఆత్మేతి) అంటే ఆ సకలంలోని మనమూ స్వాములమేగా!- అంటూ పరమాద్భుతంగా విశదీకరించారు పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Pothana Bhagavatam Episode 103 | ఇంద్రజిత్తు కన్నా.. ఇంద్రియజిత్తు మిన్న
“Pothana Bhagavatam Episode 102 | ఇంపు సొంపైన ముగింపు మాటలు”