జూలూరుపాడు, మే 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ (దళితవాడ) తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్నప్పటికీ ఈ కాలనీపై అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం కాలనీ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన మూడు చేతి పంపులు (హ్యాండ్ బోర్లు) కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఒక్క బోర్ కూడా పనిచేసే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ప్రజలు చుక్కనీటి కోసం నానా అగచాట్లు పడాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించడంతో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఒకపక్క భానుడి భగభగలు, మరోపక్క మిషన్ భగీరథ నీరు కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో కాలనీవాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కాలనీలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, చివరకు దశదిన కర్మల వంటి కార్యక్రమాలకు కూడా నీటి కోసం దూర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడి నీటి కోసం వెంగన్నపాలెం పంచాయతీ పాలకవర్గానికి, ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని దళితవాడ ప్రజలు ఆరోపిస్తున్నారు. తమమా నీటి కష్టాలు ఎప్పటికైనా తీరతాయా అనేది ఇప్పుడు కాలనీలో ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ఎస్సీ కాలనీలో నూతన హ్యాండ్ బోర్లను ఏర్పాటు చేసి తమ దాహార్తిని తీర్చాలని కాలనీవాసులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.